జగన్ సర్కారుకు హైకోర్టు షాక్- వాలంటీర్లు సెల్ఫోన్స్ అప్పగించాల్సిందే-డివిజన్ బెంచ్ తీర్పు
ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రభుత్వంలో నియమించిన వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్ల సాయంతో ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ప్రయత్నాలకు హైకోర్టు డివిజన్ బెంచ్ చెక్ పెట్టింది. ఎన్నికల సమయంలో అధికారుల వద్ద సెల్ఫోన్లు డిపాజిట్ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది. దీంతో ప్రభుత్వానికి వార్డు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోక తప్పడం లేదు.
హైకోర్టులో జగన్ సర్కారుకు మరో షాక్
ఇప్పటికే ఏపీలో ఎన్నికల సందర్భంగా హైకోర్టులో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న వైసీపీ సర్కారుకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న వార్డు వాలంటీర్ల సెల్ఫోన్ల వాడకం ద్వారా ఎన్నికల్లో వైసీపీ లబ్ది పొందకుండా ప్రత్యర్ధి పార్టీల ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల సెల్ఫోన్లను ఎన్నికలు ముగిసేవరకూ అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆధేశాలు ఇచ్చారు. వీటిని హైకోర్టు సింగిల్ బెంచ్లో సవాల్ చేసిన ప్రభుత్వానికి ఊరట లభించినా డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది.
వాలంటీర్ల మొబైల్ ఫోన్లు అప్పగించాల్సిందే
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న వార్డు వాలంటీర్లు విధిగా తమ మొబైల్ ఫోన్లను ఉన్నతాధికారులకు అప్పగించాల్సిందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న తీర్పు చెప్పింది. గతంలో సెల్ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. దీంతో వాలంటీర్ల సెల్ఫోన్ల వ్యవహారంపై ఎస్ఈసీ ఆధేశాలను వ్యతిరేకిస్తూ హైకోర్టుకెళ్లిన ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో
హైకోర్టు ఆదేశాలతో వార్డు వాలంటీర్లు తమ సెల్ఫోన్లను అధికారులకు అఫ్పగించేందుకు సిద్ధమవుతున్నారు.
అవసరాన్ని బట్టి మొబైల్స్ తీసుకోవచ్చన్న హైకోర్టు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఇందులో తమ విధి నిర్వహణలో మొబైల్ ఫోన్ అవసరమని భావిస్తే అధికారులకు ఆ మేరకు వివరించి మొబైల్ ఫోన్ తీసుకునేందుకు వాలంటీర్లకు అవకాశం కల్పించింది. పని ముగిశాక తిరిగి మొబైల్ ఫోన్ను అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
వాలంటీర్లు హద్దు మీరితే ఎస్ఈసీ చర్యలు
అయితే వాలంటీర్ల మొబైల్ ఫోన్లపై ఎస్ఈసీకి హైకోర్టు డివిజన్ బెంచ్ మరో వెసులుబాటు కూడా ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మొబైల్ ఫోన్లను వాలంటీర్లు వాడినట్లు తేలితే సదరు వాలంటీర్లపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు హైకోర్టు ఎస్ఈసీకి అనుమతి ఇచ్చింది. వాలంటీర్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎస్ఈసీ నియమించిన అధికారులు నిర్దారిస్తే వారిపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు హైకోర్టులో అంగీకరించారు. దీంతో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.