జగన్ సర్కార్ పై కాగ్ మరో బాంబు-ఏప్రిల్లో దేశంలో నంబర్ వన్-ఆర్నెల్ల అప్పు నెలలోనే
ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నానాటికీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కాగ్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే రహస్య అప్పులు కూడా తీసుకుంటున్న జగన్ సర్కార్ కు తాజా కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలు శరాఘాతంగా మారబోతున్నాయి. ఈ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏపీకి రుణ పరిమితిపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా ఇరుకునపడేలా కనిపిస్తోంది. ఇక రాష్ట్రానికీ ప్రతీ రూపాయి పుట్టడమూ కష్టమ్యయే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
అప్పులాంధ్రప్రదేశ్ పై కాగ్ రిపోర్ట్
ఏపీలో ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ దివాళా దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు కాగ్, పీఏసీ వంటి రాజ్యాంగ వ్యవస్ధలు నిత్యం ఏపీ ఆర్ధిక పరిస్ధితి డొల్లతనాన్ని బయటపెడుతున్నా ప్రభుత్వం మాత్రం పరిస్ధితిని చక్కదిద్దేందుకు సీరియస్ ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయిన రాష్ట్రానికి తాజాగా వెల్లడైన కాగ్ నివేదిక మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఇందులో పేర్కొన్న పలు అంశాల్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటే మాత్రం మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.
ఏప్రిల్లో దేశంలోనే నంబర్ వన్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను కాగ్ నివేదిక బయటపెట్టింది. ఇందులో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది. ఆర్ధిక సంవత్సరంలో మొదటి నెలలోనే ఏపీ ప్రభుత్వం రూ.19,714 కోట్ల రుణాలు తీసుకుని ఖర్చు చేసినట్లు కాగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ఏపీ తర్వాత స్ధానంలో ఉన్న కేరళ రూ.14,010 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వెల్లడైంది. మిగతా రాష్ట్రాలన్నీ ఈ నెలలో 10 వేల కోట్ల అప్పులే తీసుకున్నాయి. తెలంగాణ అయితే మరీ అత్యల్పంగా కేవలం రూ.1925 కోట్ల అప్పుల్ని మాత్రమే తీసుకుంది.
నెలలోనే ఆరునెలల అప్పు
ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం చేసిన రూ.19,714 కోట్ల అప్పు ఆరునెలల్లో చేయాల్సిన అప్పు కావడం మరో విశేషం. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేసుకునేందుకు కేంద్రం పెట్టిైన పరిమితి రూ. 37079 కోట్లు కాగా.. ఇందులో రూ.19714 కోట్లను ప్రభుత్వం కేవలం ఏప్రిల్ నెలలోనే తీసుకుని ఖర్చు పెట్టేసింది. ఇందులో ప్రజా రుణం కింద దాదాపు రూ.4 వేల కోట్లు, ప్రజా పద్దుల కింద రూ.15 వేల కోట్లకు పైగా రుణాలున్నాయి. ఏడాది అప్పులో 53 శాతంగా ఉన్న ఈ అప్పును నెలలోనే ఏపీ ఖర్చుపెట్టడాన్ని కాగ్ ఇక్కడ కీలకంగా ప్రస్తావించింది.
రాబడికి ముూడొంతుల ఖర్చు
ఏప్రిల్ నెలలో పన్నుల రాబడి రూ.7738 కోట్లుగా నమోదు కాగా.. ఈ నెలలో అప్పులు మాత్రం రూ.19714 కోట్లుగా నమోదయ్యాయి. అంటే పన్నుల ద్వారా వస్తున్న రాబడికి దాదాపు మూడు రెట్ల అప్పుల్ని ప్రభుత్వం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. పన్నుల రాబడితో పాటు జీఎస్టీ వాటా రూపంలో కేంద్రం నుంచి వచ్చిన మొత్తం, పన్నేతర ఆదాయం కలిపితే రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఏప్రిల్లో ప్రభుత్వం పెట్టిన ఖర్చు మాత్రం. రూ.31 వేల కోట్లుగా ఉంది. అంటే రాబడి కంటే ఖర్చు మూడొంతులు ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇక ప్రతీ రూపాయీ కష్టమే
జగన్ సర్కార్ ప్రస్తుతం చేస్తున్న అప్పులు, వస్తున్న రాబడి, కేంద్రం విధిస్తున్న అప్పుల పరిమితి వంటి అంశాల్ని పరిగణనలోకి తీసకుని చూస్తే ఇక ఏపీకి రూపాయి పుట్టడం కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే అప్పులు వివరీతంగా పెరిగిపోవడం, ఖర్చుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడం, భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా రాష్ట్రంలో రూపాయి ఆదాయం కూడా పుట్టకపోవడం ఇలా ఎటు చూసినా ప్రతికూల పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఇాలాంటి తరుణంలో కేంద్రం కూడా రుణ పరిమితి నిర్ధారణకు కాగ్ నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.