మద్యం కొనలేక స్పిరిట్, శానిటైజర్లు తాగేస్తున్న జనం- రెండు రోజుల్లో ఏపీలో ఏడుగురు మృతి....
ఏపీలో పెరిగిన మద్యం ధరలు మందు బాబులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీ రేట్లు పెట్టి మద్యం కొనలేని పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్న వీరు... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే కోవలో మద్యానికి బదులుగా స్పిరిట్, శానిటైజర్లు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి ప్రభుత్వ విధానాన్ని చర్చనీయాంశమయ్యేలా చేసింది.
ఏపీలో మరో 535 మద్యం షాపుల తగ్గింపు - నేటి నుంచే అమల్లోకి...
మద్యనిషేధంలో భాగంగా...
ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు సంపూర్ణ మద్య నిషేధం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి ఏడాది అన్ని మద్యం షాపులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సర్కారు.. అందులో 20 శాతం మూసేసింది. తాజాగా మరో 13 శాతం షాపులు మూసేసింది. అదే సమయంలో లాక్ డౌన్ లో మద్యం షాపులు మూతపడ్డాయి. మినహాయింపుల్లో భాగంగా మద్యం షాపులకు జనం ఎగబడటంతో ఇదే అదనుగా మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచేసింది. దీంతో మందుబాబులకు దిక్కుతోచని పరిస్ధితి ఎదురవుతోంది.
అక్రమ మార్గాల్లో మద్యం...
ఏపీలో మద్యం ఖరీదైన వస్తువుగా మారిపోవడంతో పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగింది. ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేసినా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులే మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది. తాజాగా వివిధ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు టాస్క్ ఫోర్స్ దాడుల్లో తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ దొరికిపోయారు. దీంతో ప్రభుత్వం దీనిపై మల్లగుల్లాలు పడుతోంది.
ప్రత్యామ్నాయాలపై చూపు... మృత్యువాత...
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగిపోవడంతో మందుబాబులు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో పడ్డారు. మందుకు బదులుగా స్పిరిట్, శానిటైజర్లు, కల్లు, ఛీఫ్ లిక్కర్ వైపు మొగ్గు చూపిస్తున్న పరిస్దితి చాలా చోట్ల కనిపిస్తోంది. ఇందులో ఆదివారం స్పిరిట్ సేవించి విశాఖ జిల్లాలో ఐదుగురు యువకులు చనిపోగా.. నిన్న కడప జిల్లాలో శానిటైజర్ సేవించి తల్లీ, కుమారుడు చనిపోయారు. దీంతో రెండు రోజుల్లోనే మద్యానికి ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించి ఏడుగురు చనిపోయనట్లయింది. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ స్పిరిట్ , శానిటైజర్లతో పాటు మరే ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లొద్దని చెబుతోంది. మద్యానికి దూరంగా ఉండాల్సిందేనంటోంది.