వైఎస్ జగన్కు సవాల్ విసురుతున్న టీటీడీ బోర్డు వ్యవహారం.. అలిగిన భూమన కోసం..!
తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో కొత్తగా మరి కొందరిని నియమించింది ప్రభుత్వం. ఇదివరకు కొత్తగా నియమించిన 24 మంది సభ్యులకు అదనంగా మరో ఏడుమందిని పాలక మండలిలోకి తీసుకుంది. ఈ ఏడుమంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. టీటీడీ పాలక మండలిలో ఇప్పటిదాకా ప్రత్యేక ఆహ్వానితులు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. తాజాగా కొత్తగా సృష్టించిన హోదాతో ఏడుమందిని నియమించడం చర్చనీయాంశమైంది. టీటీడీ పాలక మండలిలో తనకు సభ్యత్వం కల్పించకపోవడంపై కినుక వహించిన భూమన కరుణాకర్ రెడ్డిని బుజ్జగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రత్యేక ఆహ్వానితులు వీరే..
భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్, ముంబైలల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా సంఘం అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, రాకేశ్ సిన్హా (ఢిల్లీ), ఏజే శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై) ఇకపై ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ పాలక మండలి సమావేశాలకు హాజరవుతారు. వారికి ఓటింగ్ లో పాల్గొనే అధికారాన్ని కల్పించలేదు ప్రభుత్వం.
ఓటింగ్ హక్కు ఉండదు గానీ..
కీలకమైన తీర్మానాలపై నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలి తరచూ ఓటింగ్ విధానాన్ని నిర్వహిస్తుంటుంది. అలాంటి ఓటింగ్ లో ప్రత్యేక ఆహ్వానితులకు ఓటు హక్కును కల్పించ లేదు. పాలక మండలి సభ్యులతో సమానంగా ప్రత్యేక ఆహ్వానితులకు ప్రొటోకాల్ అధికారాన్ని ఇచ్చింది. ఒక్క ఓటింగ్ మినహా.. పాలక మండలి నిర్వహించే ప్రతి సమావేశంలోనూ వారు పాల్గొనవచ్చు.. పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. పాలక మండలి తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ, వారు రూపొందించే ప్రతి ప్రతిపాదనలపైనా ప్రత్యేక ఆహ్వానితులు సైతం సంతకాలు చేయడానికి వీలు ఉంది. ఒక్క ఓటు హక్కు మినహా.. మిగిలిన సభ్యులతో సమానంగా వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఆ శేఖర్.. ఈ శేఖర్ ఒక్కరేనా?
చెన్నై నుంచి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికైన ఏజే శేఖర్ పేరు అందరి దృష్టినీ ఆకర్షించింది ప్రధానంగా జాతీయ మీడియా. చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి చెన్నైకి చెందిన వారే కావడం వల్ల.. ఆయన, ఈయన ఒక్కరేనా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన కొద్దిరోజుల తరువాత.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెన్నైలోని శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏజే శేఖర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు
ఏజే శేఖర్ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలన్నీ 2000 రూపాయలవే కావడం అప్పట్లో వివాదాన్ని రేకెత్తించింది. 2000 రూపాయల నోట్ల కట్టలు శేఖర్ రెడ్డి నివాసంలో లభించడంపై దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పటికప్పుడు ఆయనను పాలక మండలి నుంచి ఉద్వాసన పలికింది. తాజాగా చెన్నై నుంచే ఏజే శేఖర్ పేరుతో మరొకరు ఎంపిక కావడం పట్ల జాతీయ మీడియా అనుమానాలను వ్యక్త చేస్తోంది. శేఖర్ రెడ్డి, ఏజే శేఖర్ ఒక్కరే అని చెబుతున్నాయి.