గుంటూరు జిల్లాకు మళ్లీ పిడుగుపోటు...వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత
గుంటూరు:గుంటూరు జిల్లాపై మరోసారి పిడుగులు ప్రతాపం చూపించాయి. జిల్లాలో వర్షంతో పాటు పిడుగుల వర్షం పడిందా అన్న చందంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఏడుగురు మృత్యువాతన పడ్డారు.
అంతేకాదు ఈ పిడుగుల ధాటికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, గేదెలు సైతం మరణించగా పలువురు షాక్ కు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గడచిన మూడు నెలల్లో సుమారు 50 వేలకు పైగా పిడుగులు పడగా ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇటీవలి కాలంలో పిడుగుపాటుకు గురై 50 మందికి పైగా మృతి చెందారు. ఇదిలావుంటే తూర్పుగోదావరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. కేబుల్ వైరును పట్టకున్న మరిది, వదిన ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
పిడుగుపాటుకు గురై గుంటూరు జిల్లాలో మృత్యువాతన పడినవారి వివరాలివి...నరసరావుపేట మండలంలోని దొండపాడుకు చెందిన చిన్నపరెడ్డి శివారెడ్డి(60) తన పొలంలో పని చేసుకుంటుండగా పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని మరో మహిళ అంచా శివ కుమారి కూడా పిడుగు పాటు కారణంగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పమిడిమర్రులో నలుగురు వ్యక్తులు పిడుగు పాటుకు గురయ్యారు. వీరిలో అనంత్ పెద్దబ్బాయి (30) మృతి చెందాడు.
మరో ముగ్గురు దారా లక్ష్మయ్య, చిన్నం పూర్ణచంద్రరరావు, దార్ల కోటేశ్వరరావులు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. వీరిలో దార్ల కోటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో 20 గొర్రెలు కూడా మృతి చెందాయి. వీరంతా చెట్టు కింద ఉండగా పిడుగు పడింది. మరోవైపు క్రోసూరు మండలంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు గంటసేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, పిడుగులతో జనం బెంబేలెత్తారు. 88 తాళ్ళూరుకు చెందిన కుంభా కోటేశ్వరమ్మ (60) పిడుగుపాటుతో మరణించింది.
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఎద్దులను మేత కోసం తోలుకుని వెళ్ళిన కోపూరి అశోక్(29) పిడుగుపాటుతో మృతిచెందాడు. ఆ సమీపంలో పశువులను కాస్తున్న బొల్లా రాంబాబు షాక్కు గురయ్యాడు. అశోక్కు చెందిన ఎద్దులు ఇంటికి వచ్చాయి. చీకటిపడిన అశోక్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అశోక్ కుటుంబసభ్యులు పొలాల్లో వెతకగా అక్కడ నిర్జీవంగా పడి ఉన్నాడు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడుకు చెందిన దాసరి బొల్లయ్య(27) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బొల్లయ్య పొనుగుపాడు మండలం బేతపూడి పంట పొలాల సమీపంలో పనిచేస్తుండగా పిడుగు పడింది.
నాగార్జున సాగర్ డ్యాం దిగువన కృష్ణానదిపై గల కొత్త బ్రిడ్జిపై బత్తాయి జ్యూస్ అమ్ముకుని జీవించే దుగ్యాల అంజయ్య(35) బండి వద్ద ఉండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. . ఫిరంగిపురం మండలంలోని యర్రగుంట్లపాడు గ్రామ పొలాల్లో గొర్రెలు మేపుకుంటుండగా పిడుగుపడి వ్యక్తి మృతి చెందగా పశువులు కాసుకుంటున్న మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. యర్రగుంట్లపాడు గ్రామానికి చెందిన శివాలశెట్టి ప్రసాద్ (55) గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ఘటనాస్థలంలోనే ప్రాణం విడిచాడు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కరణంగారి కూడలిలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో వదిన, మరిది మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంట్లో కేబుల్ వైరుకు విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో వాటిని తొలగించే ప్రయత్నంలో మరిదికి తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిది అచేతనంగా పడి ఉండటంతో చేసేందుకు ఏం జరిగిందోనని ఆందోళనతో అక్కడికి వచ్చిన వదిన కేబుల్ వైరు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఆమె కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయింది.