తెల్లారితే కొడుకు పెళ్ళి: బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎమ్మెల్యే తాపత్రయం
గుంటూరు: తెల్లవారితే కొడుకు పెళ్ళి. కొడుకు పెళ్ళి పనులు కూడ పక్కన పెట్టి బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ను రక్షించే పనిలో గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఉన్నారు. బోరుబావి నుండి చంద్రశేఖర్ సురక్షితంగా బయట పడడంతో ఎమ్మెల్యేపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కొడుకు వివాహం ఈ నెల 16వ,తేదిన ఉదయం 8.30 గంటలకు గుంటూరులో జరిగింది. అయితే ముమ్మిడివరంలో బోరుబావిలో రెండేళ్ళ బాలుడు పడిపోయాడు.
అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు సంఘటనస్థలానికి హుటాహుటిన చేరుకొన్నారు.
పెళ్ళి పనులను పక్కనపెట్టారు. ఘటనస్థలంలోనే సహయకచర్యల్లో అధికారులతో కలిసి పనిచేశారు. బుదవారం తెల్లవారుజామున 2.45 నిమిషాలకు బోరుబావి నుండి సురక్షితంగా బాలుడిని వెలికి తీశారు.
బోరుబావి నుండి బాలుడిని బయటకు తీసిన తర్వాతే జివి ఆంజనేయులు ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళి పనులను చూశారు. ఉదయం పూట పెళ్ళికి వచ్చినవారంతా ఆంజనేయులును అభినందించారు.