నేను పెద్దయ్యే సరికి మీరే సీఎంగా ఉండాలి: చంద్రబాబును కోరిన నాలుగేళ్ల బాలుడు
Recommended Video
అమరావతి: ఓ నాలుగేళ్ల బాలుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వింత కోరిక కోరాడు. ప్రస్తుతం తన వయస్సు నాలుగేళ్లని, తాను పెరిగి, పెద్దయ్యే సరికి ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆ బాలుడి చేసిన ఈ విజ్ఞప్తికి చంద్రబాబు చిరునవ్వుతో తల ఊపుతూ సమాధానం ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
కడుపులో మంటతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చీబౌలిలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సుమారు అయిదురోజుల పాటు హైదరాబాద్లోని తన సొంత ఇంట్లో గడిపిన ఆయన ఈ ఉదయం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు పార్టీ అభిమానులు, కార్యకర్తలు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా గన్నవరం నుంచి వచ్చిన దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు భానుశేఖర్తో కలిసి ఉండవల్లికి వచ్చారు. చంద్రబాబును కలిశారు. ఓ పూలకుండీని చంద్రబాబుకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆ బాలుడు తన మనసులోని కోరికను చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. తాను పెరిగి, పెద్దయ్యే సరికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ బుడ్డోడు చంద్రబాబును కోరారు. దీనితో ఆయన చిరునవ్వు నవ్వారు.
కాగా- పలు జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉండవల్లి నివాసానికి బారులు తీరారు. చంద్రబాబును కలుసుకున్నారు. వారిలో కొందరు ఆయనకు పాదాభివందనం చేయడం కనిపించింది. వారిని ఉద్దేశించి చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించకూడదని అన్నారు. పార్టీ కార్యకలాపాలను గ్రామల్లో విస్తరింపజేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు.
చంద్రబాబును కలిసిన కుప్పం నేతలు..
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలుసుకున్నారు. మరోసారి తనను గెలిపించినందుకు చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తాను కుప్పం పర్యటనకు వస్తానని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పర్యటిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని, అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.