ఏపీలో తీవ్రంగా మందుల కొరత- రెండు రోజులు దాటితే అంతే సంగతులు.. !
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మందుల కొరత అంతకంతకూ తీవ్రమవుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఏమో కానీ అత్యవసరంగా వేసుకోవాల్సిన మందులు లేకపోతే మాత్రం ఇప్పుడే తమ ప్రాణాలు పోయేలా ఉన్నాయని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రోజు వారీ రావాల్సిన మందులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిస్ధితి విషమించేలా కనిపిస్తోంది.
ఏపీలో మందుల కొరత తీవ్రం..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మందుల కొరత తీవ్రమవుతోంది. వారం రోజులుగా మందుల దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ మందులు లభ్యం కాకపోవడంతో పరిస్ధితి దారుణంగా మారుతోంది. ముఖ్యంగా బీపీ, షుగర్ తో పాటు తీవ్రమైన రోగాలు ఉన్న వారికి నిత్యం మందులు తప్పనిసరి. వాటిని సకాలంలో వేసుకోకపోతే వారి పరిస్ధితి దారుణంగా మారుతుంది. దీంతో ఇప్పుడు వారు మందుల షాఫులకు క్యూ కడుతున్నారు. అయితే అక్కడ మందుల స్టాకే లేదనే సమధానం వారికి వస్తోంది.
నిలిచిన ఉత్పత్తి, రవాణాతో సమస్యలు..
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్ర్రాల్లో ఉన్న ఫార్మా కంపెనీలకు ఉద్యోగులు రావడం మానేశారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలు కొన్నయితే, బయటికి రాకుండా పోలీసులు పలుచోట్ల అడ్డుకోవడం మరికొంత దీనికి కారణమవుతోంది. దీంతో ఫార్మా కంపెనీల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రభుత్వం నిత్యావసరాలు, మందుల తయారీ సంస్ధలు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చినా సిబ్బంది రాకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. దీంతో సహజంగానే మందుల కొరత తప్పడం లేదు.
చొరవ చూపని ప్రభుత్వాలు..
ఏపీలో మందుల కొరత తీవ్రమవుతున్నా ప్రభుత్వం చొరత తీసుకుని ఇతర రాష్ట్రాలను సంప్రదిస్తున్న పరిస్దితి లేదు. ఇప్పటివరకూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై పలుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మందుల ఉత్పత్తి, సరఫరా లేకపోతే ఏం జరగబోతోందో సీరియస్ గా దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. దీంతో మందుల షాపుల్లో కనీస అవసరాలకు సరిపడా స్టాక్ లు కూడా లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాల నుంచి సహకారం కరవవడంతో మందుల షాపుల యజమానుల్లోనూ ఆందోళన పెరుగుతోంది.
రెండ్రోజుల్లో మందులు రాకపోతే..
ఇప్పటికే తమ వద్ద నున్న అత్యవసర మందులను రోగులకు విక్రయించేసిన షాపుల యజమానులు తదుపరి స్టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ దీనిపై ప్రభుత్వాల నుంచి స్పష్టత రాకపోవడంతో మందుల షాపుల అసోసియేషన్లు సమావేశాలు పెట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సైతం సిద్ధమవుతున్నారు. వీరి ప్రయత్నాలు ఎలా ఉన్నా రెండు రోజుల్లో మందుల సరఫరా ప్రారంభం కాకపోతే మాత్రం కరోనే కంటే ముందు ఇప్పటికే ఉన్న రోగాలతో జనం ప్రాణాలు వదలాల్సిన పరిస్దితులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.