సంచలనం:గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో లింగమార్పిడి ఆపరేషన్లు;రాష్ట్రంలోనే తొలిసారి
గుంటూరు: గుంటూరు ప్రభత్వ సమగ్ర వైద్యశాల(జిజిహెచ్)మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది. రాష్టంలోనే తొలిసారిగా లింగ మార్పిడి శస్త్ర చికిత్స(సెక్స్ రీ ఎసైన్ మెంట్ సర్జరీ లకు తెరతీయడం ద్వారా జిజిహెచ్ మరో మైలురాయిని అధిగమించనుంది.
ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించనుండటం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు దేశంలో కేవలం ప్రైవేట్ ఆస్పత్రులలో మాత్రమే ఈ లింగమార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఒక ప్రభుత్వాసుపత్రిలో ఈ విధమైన ఆపరేషన్లు చేయనుండటం సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష వరకు వసూలు చేసే ఈ సర్జరీని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఫ్రీగానే చేయనుండటం మరో విశేషం.
ఈ ఆపరేషన్...ఎందుకంటే?
అసలు ఈ లింగమార్పిడి ఆపరేషన్ చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే పుట్టుకతోనే జననావయవాల్లో అవకరాలు, అలాగే పురుషుల్లో కొన్ని హార్మోన్లలో తేడాతో కారణంగా హిజ్రాలుగా మారాలని నిర్ణయించుకోవడం...ఈ కారణాలతో సెక్స్ రీ ఎసైన్ మెంట్ సర్జరీ లను చేస్తారు. అయితే వీరికి శారీరక,మానసిక సబంధమైన వివిధ వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరమే ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ కు అర్హులైన వారు సైతం వీటిని చేయించుకోవాలంటే ప్రభుత్వాసుపత్రులలో ఎక్కడా అవకాశం లూకపోవడంతో కార్పొరేట్ హాస్పటల్స్ ను ఆశ్రయిస్తున్నట్లు, అక్కడ 60 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి ఈ సర్జరీ చేయించుకున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా...ఎక్కడంటే
ఈ తరహా సర్జరీలకు ముంబాయి పెట్టింది పేరుగా చెబుతారు. ఆ తరువాత స్థానాల్లో కోల్ కతా, ఢిల్లీతో పాటు మరి కొన్ని మెట్రో పాలిటన్ సిటీల్లో ఈ శస్త్ర చికిత్సలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయా అర్హతా గుర్తింపు పత్రాల కోసం జిజిహెచ్ కు పెద్ద సంఖ్యలో హిజ్రాలు తరలివస్తున్నట్లు తెలిసింది. అలా వచ్చిన హిజ్రాలు ఈ సర్జరీలు అవసరమైనవారు రాష్ట్రంలో ఎందోమంది ఉన్నారని, వారు ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత కష్టతరమనేది జిజిహెచ్ వైద్య వర్గాలకు ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన జిజిహెచ్ సెక్స్ మార్పిడి ఆపరేషన్లకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆస్పత్రిలోని యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ సర్జరీలు నిర్వహించేందుకు సంసిద్దమైనట్లు తెలిసింది. అంతేకాదు ప్రభుత్వాసుపత్రికి తగినట్లుగానే ఈ ఆపరేషన్లను పూర్తి ఉచితంగా నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
200 మందికి...గుర్తింపు పత్రాలు
ఎపి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అర్హులుగా నిర్థారిస్తూ ఇప్పటివరకు జిజిహెచ్ నుంచి 200 మంది హిజ్రాలకు గుర్తింపు పత్రాలు జారీ చేసినట్లు తెలిసింది. వీరికి ప్రతి గురువారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి తద్వారా ఆ గుర్తింపు పత్రం జారీ చేస్తున్నట్లు జిజిహెచ్ వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇక జిజిహెచ్ లో నూతనంగా చేపట్టనున్న లింగ మార్పిడి సర్జరీకి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకునేవారు వారి అంగీకార పత్రం తో పాటు వారి తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులకు ఎట్టి అభ్యంతరం లేదని రాతపూర్వక అఫిడవిట్ ఇస్తేనే శస్త్రచికిత్స చేస్తామని జిజిహెచ్ వైద్య వర్గాలు మీడియాకు వెల్లడించడం జరిగింది.
ఈ ఆపరేషన్...వివరాలు
ఈ సెక్స్ మార్పిడి ఆపరేషన్ కు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని, ఉచితంగానే చేస్తామని జిజిహెచ్ వైద్య వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఆపరేషన్ల విషయమై వివాదాలు తలెత్తకుండా, వైద్య వర్గాలు జవాబుదారీతనంతో వ్యవహరించేలాగా వైద్య సేవ పథకం కింద చేరిస్తే బావుంటుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఎవరికి, ఎంతమందికి ఆపరేషన్లు చేస్తున్నారనేది ఒక రికార్డుగా నమోదవుతూ ఉంటుందని, ఇది ఈ ఆపరేషన్లకు సంబంధించి పారదర్శకత కోసం ఆవశ్యమని వారంటున్నారు. ఏదేమైనా లింగమార్పిడి ఆపరేషన్లకు ముందుకు రావడం ద్వారా జిజిహెచ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.