అది లాడ్జీ కాదు, వ్యభిచార కూపం: మహిళలతోపాటు 6గురి అరెస్ట్
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె పట్టణ నడిబొడ్డున సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టణంలో ఉన్న లాడ్జీపై దాడి చేసి, వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రెండోపట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతునాయక్ వెల్లడించారు. మదనపల్లెలోని చిత్తూరు బస్టాండు వద్ద ఉన్న ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతోందని తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జరిపిన దాడుల్లో లాడ్జీ రూంబాయ్గా పనిచేస్తున్న వ్యక్తి (39) లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్నారని తేలిందన్నారు.
ఇతనితో పాటు బి.కొత్తకోట మండలం పెద్దపల్లెకు చెందిన విటుడు(27)తో పాటు బస్టాండుకు వచ్చే మహిళలను, యువతులను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపే ఎస్టేట్కు చెందిన నలుగురు మహిళలను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు ఆయన వివరించారు.
చిత్తూరు సమీపంలోని అడవిపల్లెకు చెందిన లాడ్జీ యజమాని కుమారుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతనిపై కూడా కేసు నమోదు చేశామని వివరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.