ఇంటి నుంచి విజయవాడకు వస్తే.. యువతిని వ్యభిచారం కూపంలోకి నెట్టారు, ఏడాది నరకం
విజయవాడ: నగరంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబసభ్యులపై కోపంతో విజయవాడకు వచ్చిన ఓ యువతిని నమ్మించి వ్యభిచార కూపంలోకి దించారు కొందరు దుర్మార్గులు.
పని ఇప్పిస్తానని చెప్పిన ఓ ఆటో డ్రైవర్.. ఆ యువతిని వ్యభిచార నిర్వాహకురాలికి రూ.20వేలకు అమ్మేశాడు. ఏడాదిపాటు నరకం అనుభవించిన ఆ యువత ఎట్టకేలకు బయటపడింది.
ఇంటినుంచి పారిపోయి విజయవాడకు
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆ యువతి తల్లిదండ్రులు గత కొంతకాల క్రితం చనిపోవడంతో పెదనాన్న ఆశ్రయంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ వృద్ధుడితో ఆమెకు వివాహం చేయాలని పెదనాన్న నిర్ణయించడంతో ఇంట్లో నుంచి పారిపోయి విజయవాడకు వచ్చింది.
మాయమాటలు చెప్పి వ్యభిచార నిర్వాహకురాలికి అమ్మేశాడు
విజయవాడ బస్టాండ్లో ఉన్న ఆ యువతిని ఉపాధి ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పిన ఓ ఆటో డ్రైవర్ శోభారాణి అనే వ్యభిచార గృహం నిర్వాహకురాలికి రూ.20వేలకు అమ్మేశాడు. జక్కంపూడి వైయస్సార్ కాలనీలో వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్న శోభారాణి.. ఆ యువతిని అన్ని ప్రాంతాలకు పంపి వ్యభిచారం చేయాలంటూ చిత్రహింసలకు గురిచేసింది.
స్థానికుల సాయంతో నరకం నుంచి బయటపడిన యువతి
బాధిత యువతితోపాటు మరికొంత మంది అమాయక యువతులను ఈ కూపంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాగా, స్థానికుల సహాయంతో వ్యభిచారం కూపం నుంచి బాధితురాలు బయటపడింది. వ్యభిచార నిర్వాహకురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. వ్యభిచార కూపం నిర్వాహకురాలి నుంచి మామూళ్లు తీసుకుంటున్నందునే పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సెక్స్ రాకెట్ నిర్వాహకురాలి అరెస్ట్..
కాగా, తమకు అందిన సమాచారం మేరకు జక్కంపూడిలో సోదాలు నిర్వహించామని, వ్యభిచార గృహం నిర్వాహకురాలు శోభారాణిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికుల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.