ఉపాధి పేరుతో వ్యభిచారం కూపంలోకి: గల్ఫ్ దేశాల్లో అమ్మేస్తున్నారు
విజయవాడ: పేదరికంలో మగ్గుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు బ్రోకర్లు ఎదురు పెట్టుబడులు పెట్టి ఉపాధి పేరుతో గల్ఫ్ దేశాలకు తరలించి వ్యభిచార వృత్తికి అమ్ముకుంటున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్లో జరిగిన దారుణంగానే తెలుస్తోంది.
ఇద్దరు మధ్యవర్తుల బారిన పడి బహ్రెయిన్లో అడుగుపెట్టిన ఓ మహిళ అష్టకష్టాలు పడింది. చిత్రహింసలకు గురైంది. చావు దగ్గరికీ వెళ్లొచ్చిన ఆమె ఓ విదేశీ సామాజిక కార్యకర్త సహకారంతో ఎట్టకేలకు మన దేశానికి చేరుకుంది.
ఆమె అందించిన వివరాల ప్రకారం.. అక్కడ షేక్ల అమానుష లైంగిక దాడులకు తట్టుకోలేని ఇలాంటి బాధితులు మరెందరో అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ, యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. మధ్యవర్తుల నుంచి కోర్టుల్లో ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్నారు.
కాగా, తమ గోడు వెలిబుచ్చుకుని న్యాయం అడిగేందుకు సదరు బాధితురాలు భర్తతో కలిసి ఆదివారం విజయవాడ వచ్చింది. నగరంలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు రాగా.. డిజిపి అందుబాటులో లేనందున వెనుదిరిగారు. ఈసందర్భంగా బాధితురాలు, ఆమె భర్త తమకు జరిగిన అన్యాయం గూర్చి మీడియా ఎదుట వాపోయారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం, ఈలకొలను గ్రామానికి చెందిన సూరిబాబు, భార్య భువనేశ్వరి(అసలు పేర్లు కావు). వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వికలాంగుడైన సూరిబాబు అనాధ అయిన భువనేశ్వరిని వివాహమాడాడు.
కాస్త అందంగా ఉండే భువనేశ్వరిపై కొందరు బ్రోకర్ల కన్నుపడింది. పెద్దాడకు చెందిన పల్లపాటి రామకృష్ణ, జి మామిడాడకు చెందిన సిహెచ్ రత్న అనే ఇద్దరు మధ్యవర్తులు గల్ఫ్ దేశంలో ఉపాధి కల్పిస్తామని నమ్మబలికారు.
పాస్పోర్టు, వీసా కోసం రూ. 50వేల వరకు వారే ఖర్చు పెట్టి, తొలి 3నెలల జీతం తమకు కమిషన్ ఇవ్వాలని ఒప్పందంతో ఖర్చులకు కొంత డబ్బు కూడా చేతికిచ్చి 2014లో భువనేశ్వరిని బహ్రెయిన్ పంపారు. ఇక అంతే అక్కడి నుంచి ఆమె వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఇక్కడివారు ఆందోళనలో కొట్టుమిట్టాడారు.
కాగా, రోజూ తాగొచ్చి లైంగిక దాడి చేస్తారని, చిత్ర హింసలు పెడతారని బాధిత మహిళ వాపోయింది. రోజులో ఒకసారి చపాతీ, గ్లాసు నీళ్లు మాత్రమే ఇస్తారని తెలిపింది. జీతం అడిగితే తాము ముందే ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు చెప్పారని కన్నీటి పర్యాంతమైంది. ఎప్పుడైనా ఎదురుతిరిగితే అక్కడి పోలీసులతో కూడా కొట్టించేవారని చెప్పింది. ఓ మహిళా సామాజిక కార్యకర్త సహకారంతో ఆ నరకం నుంచి తాను బయటపడినట్లు ఆమె తెలిపింది.