వేశ్య గృహాలకు యువతులను అమ్మేస్తున్న ముఠా!..
తూర్పుగోదావరి : పేదింటి యువతులను బ్రోతల్ హౌజ్ లకు అమ్మేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. పేదరికంలో మగ్గిపోతున్న యువతులకు ఉపాధి ఆశ చూపి విదేశాలకు తరలిస్తోంది ముఠా. టూరిస్ట్ వీసాతో అక్కడ అడుగుపెట్టే మహిళలు దిక్కుతోచని స్థితిలో వేశ్య గృహాల్లో మగ్గిపోతున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం తాటికాయలవారి పాలేనికి చెందిన ఎస్.నాగసోమేశ్వరరావు అలియాస్ బాబును (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను విదేశీ బ్రోతల్ హౌజ్ లకు తరలించడానికి ఓ ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేసుకున్న బాబు.. పేదింటి యువతులకు డబ్బు ఆశ చూపి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు.
విస్మయం కలిగించే విషయమేంటంటే.. యువతులను విదేశాలకు తరలించే క్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డబ్బుతో వారిని మేనేజ్ చేస్తున్నట్లుగా సమాచారం. టూరిజం వీసాతో విదేశాల్లో అడుగుపెట్టే మహిళలు.. వీసా గడువు పూర్తయ్యాక దిక్కు తోచని స్థితిలో అక్కడి బ్రోతల్ హౌజ్ లలోనే మగ్గిపోతున్నారు.
కేసుతో సంబంధమున్న తమిళనాడు వ్యక్తి పాండ్యన్ రాజన్, రఫీ, ఫాతిమా, ఏసుప్రియ అలియాస్ భీమవరం ఆంటీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.