'కాకినాడ ఎంపీ పీఏ లైంగిక వేధింపులు' : మహిళ ఫిర్యాదు
కాకినాడ : తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం పీఏ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. దీంతో కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎంపీ పీఏ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రాయుడు పాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఉన్న మహిళను పీఏ శర్మ వేధింపులకు గురిచేస్తున్నాడు. తను అద్దెకు ఉంటున్న ఇల్లు పీఏ శర్మ స్నేహితుడిది కావడంతో.. ఇల్లు ఖాళీ చేయాలని శర్మ తనపై ఒత్తిడి తెస్తున్నాడని, ఇదే క్రమంలో తనపై రకరకాలుగా వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసులు కూడా తొలుత తన ఫిర్యాదు పట్ల స్పందించలేదని ఆరోపించిన మహిళ, ఆ తర్వాత కేసు నమోదు చేసినట్లుగా తెలిపింది. అయితే సదరు మహిళ పెట్టిన కేసుపై స్పందించేందుకు నిరాకరించారు సర్పవరం పోలీసులు. అటు పీఏ శర్మ కూడా కేసుపై ఇంతవరకు స్పందించలేదు. తన సోదరి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, కాబట్టి ప్రస్తుతానికి కేసుపై తానేమి మాట్లాడనని వివరించారు పీఏ శర్మ