బీటెక్ మాయగాడు: షార్ట్ ఫిల్మ్ పేరుతో యువతులు దుస్తులు మార్చుకుంటుంటే..
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ పలువురు యువతులను మోసగించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మంగళవారం కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం: చేసేది బీటెక్ అయినా.. మోసాలు చేయడంతో మాత్రం ఆరితేరిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ పలువురు యువతులను మోసగించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మంగళవారం కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలేనికి చెందిన వైడా నిఖిల్ (24) విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. అతడు షార్ట్ఫిల్మ్లు తీస్తుంటాడు. ఆరు నెలల కిందట ఫేక్బుక్ ద్వారా పలువురు యువతులతో పరిచయం పెంచుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నమ్మించాడు. అనంతరం వారిని కెమెరా టెస్టింగ్, స్టిల్ఫొటోలు అంటూ పిలిచేవాడు.
అయితే, ఆ యువతులు గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీసి వారిని వివిధ రకాలుగా బెదిరించేవాడు. ఆ తర్వాత పలువురు యువతులను లోబర్చుకున్నాడు. నిఖిల్ మాటలకు మోసపోయిన ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు తాము కూడా నిఖిల్ చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. కాగా, తనను నిఖిల్ వివాహం కూడా చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ముగ్గురిలో ఓ యువతి తెలిపింది. చాలా మంది యువతులను ఇలాగే మోసం చేశాడని నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసును కంచరపాలెం సీఐ చంద్రశేఖరరావు దర్యాప్తు చేస్తున్నారు.