సిఎం చంద్రబాబు బస్సును అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు...ఉద్రిక్తత్:రేపు ముంబాయికి ముఖ్యమంత్రి!
కర్నూలు:కర్నూలు ధర్మపోరాట సభలో పాల్గొనేందుకు శనివారం కర్నూలుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న బస్సును ఎస్ఎఫ్ఐ నాయకులు అకస్మాత్తుగా అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ధర్మపోరాట సభలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఏపీఎస్పీ పటాలం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్టీబీసీ కళాశాల మైదానానికి బయలుదేరిన క్రమంలో బస్సు సరిగ్గా ఆర్ఎస్ రోడ్డు కూడలిలోని జలమండలి కార్యాలయం వద్దకు చేరుకుంది. సిఎం బస్సు అక్కడకు రాగనే అప్పటికే అక్కడ గుమిగూడి ఉన్న ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల్లో కొందరు సిఎం బస్సును గుర్తించి పోలీసుల కళ్లు గప్పి సీఎం బస్సు వద్దకు చేరుకొని దానికి అడ్డుగా రహదారిపై బైఠాయించారు.
విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు నినాదాలు చేయడం ఆరంభించారు. అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న పోలీసులు వారిని అడ్డు తొలగించే క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 11 మంది ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసు నిఘా వైఫల్యమే ఈ ఘటనకు కారణమని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
మరోవైపు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)లో సోమవారం జరగనున్న అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ముంబై బయలుదేరివెళ్లనున్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణలో భాగంగా రూ.1300 కోట్ల విలువైన అమరావతి బాండ్లను ఎపి ప్రభుత్వం జారీ చేయగా ఇవి ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 27న బీఎస్ఈలో జరిగే బాండ్ల లిస్టింగ్ను పెద్ద ఎత్తున చేపట్టాలని సీఆర్డీయే సంకల్పించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్ మీదుగా ముంబై చేరుకోనున్నారు.
సోమవారం ఉదయం 8.30 గంటలకు చంద్రబాబు బీఎస్ఈకి చేరుకొని...అక్కడ వాణిజ్య ప్రముఖులు, విఐపిల సమక్షంలో వేడుకలా నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్లో పాల్గొంటారు. అలాగే సిఎం ఈ ముంబై పర్యటనలో భాగంగా బోంబే హౌస్కు వెళ్లి అక్కడి టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శిస్తారు. రతన్ టాటాతోనూ సమావేశమై పలు అభివృద్ది అంశాలపై చర్చిస్తారు.
ఆపై ముంబైలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో దేశంలోని ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో సిఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాల గురించి సీఎం చంద్రబాబు వారికి వివరిస్తారు. ఎపిని పలురంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వారికి తెలియజేసి పెట్టుబడులను ఆహ్వానిస్తారు.