ఏపీ సర్కారు గుడ్న్యూస్: ఎస్జీటీ నియామక ప్రక్రియ ప్రారంభం, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
అమరావతి: డీఎస్సీ 2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్య ర్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త చెప్పింది. పెండింగ్ ఉన్న కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
ఏపీలో స్కూల్స్ ప్రారంభం ఆ రోజు నుంచే, జగనన్న విద్యా కానుక కూడా: మంత్రి సురేష్
సెప్టెంబర్లోపే ఎస్జీటీల నియామకాలు పూర్తి..
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయిందని, మిగిలిన 1321 మంది రికార్డుల వెరిఫికేషన్ మంగళవారంతో పూర్తవుతుందని తెలిపారు. బుధవారంలోగా ఎస్ఎంఎస్లతో అభ్యర్థులకు సమాచారం అందిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 24న సర్టిఫికేట్ వెరిఫికేషణ్, 25, 26 తేదీల్లో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి, 26న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా..
ఇక, స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలకు కూడా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
డీఎస్సీ 2020కి ఏ అడ్డంకులూ లేవని, పెండింగ్లో ఉన్న డీఎస్సీలకు కూడా త్వరలో ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు. టెట్ సిలబస్ కూడా మారుతున్న విద్యార్థుల అవసరాల మేరకు ఆధునీకరించి తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఏపీనే తొలి రాష్ట్రం..
డీఎడ్ కేసు విషయం కోర్టులో వాయిదా పడిందని, ట్రిపుల్ ఐటీకి సంబంధించినంత కార్యాచరణపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం సాయంత్రం ఎస్జీకేటీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్ణయం వస్తుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రాథమిక విషయాలు వదలకుండా సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 9,10 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రుల అనుమతితోనే పిల్లలు స్కూలుకు రావాలని స్పష్టం చేశారు. జాతీయ నూతనవిద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందుందని, 5+3+3+4 విధానంలో విద్య అమలు చేయనున్న మొదటి రాష్ట్రం ఏపీనేనని మంత్రి తెలిపారు.