పదేళ్లు పాలించి అన్యాయం: సొంత పార్టీ నేతలపై షబ్బీర్
హైదరాబాదులో సెటిలర్స్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయలేదన్నారు. సెటిలర్స్కు భద్రత కల్పిస్తామన్నప్పటికీ వారు విశ్వసించలేదన్నారు. అలాగే తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగించాయన్నారు. గతంలో తెరాస కంటే పెద్ద పార్టీలనే తాము ఎదుర్కొన్నామని చెప్పారు.
ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ఓటమి స్వయంకృపరాధమే అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, నామినేటెడ్ పోస్టులు రాక కార్యకర్తలు ఖాళీగా ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును ఓడించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. టిడిపి నుండి కొందరు తెలంగాణ ద్రోహులు ఎన్నికల్లో గెలిచారని, తెలంగాణ ఇచ్చనప్పటికీ తాము ఓడిపోయామన్నారు.
కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. నజ్మాకు ముస్లింల సమస్యలు తెలియవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదన్న ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఆల్ ఫ్రీ అన్న పార్టీలే అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని తాము ఘనంగా నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు పోటీ పడ్డారన్నారు.