పచ్చి అబద్దాలకోరు, కాళ్లు మొక్కావు: కెసిఆర్పై షబ్బీర్
హైదరాబాద్: విలీనానికి నో చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంగళవారం నిప్పులు చెరిగారు. కెసిఆర్ ఎప్పుడు నిజాలు చెప్పిన దాఖలాలు లేవని, అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటేనని, కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లను ఎందుకు మొక్కారని ఘాటుగా ప్రశ్నించారు.
టి కాంగ్రెసు నేతలు జానా రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు తదితరులు విలేకరులతో మాట్లాడారు. విలీనం వ్యాఖ్యలను కెసిఆర్కే వదిలేస్తున్నామని చెప్పారు. కెసిఆర్ ఎప్పుడు అబద్దాలే చెబుతారన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విలీనం విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చోసుకుంటుందన్నారు. కెసిఆర్ పచ్చి అబద్దాల కోరు అన్నారు.
పిట్టల దొర కెసిఆర్ తెలంగాణ కోసం పార్లమెంటులో ఒక్క మాట మాట్లాడింది లేదన్నారు. కెసిఆర్ తన జీవితంలో ఎప్పుడు నిజాలు చెప్పలేదన్నారు. తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఇవ్వలేదని, అరవయ్యేళ్ల ప్రజల ఆకాంక్షను సోనియా గుర్తించి ఇచ్చారన్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల తాము ప్రభుత్వాన్ని కోల్పోయామన్నారు. తెలంగాణ రావడంలో కెసిఆర్ పాత్ర ఏమీ లేదన్నారు.
తెలంగాణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సవరణలు ఇస్తే, కెసిఆర్ నోరు మెదపలేదన్నారు. కెసిఆర్ను ఢిల్లీ రావాలని కోరింది తమ పార్టీ నేత అహ్మద్ పటేలే అన్నారు. కెసిఆర్ ఎప్పుడు, అందర్నీ మోసం చేస్తుంటారని దుయ్యబట్టారు. రేపో మాపో తెలంగాణ పిసిసి రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో 119 స్థానాల్లో తాము గెలుస్తామని చెప్పారు. సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని షబ్బీర్ అలీ కితాబిచ్చారు.
విలీనం చేయడం లేదని చెప్పిన కెసిఆర్కు కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని సోనియా పాదాల వద్ద పెడతానని కెసిఆర్ చెప్పారని, ఆయన విలీనం మాటలను తాము ఎప్పుడు నమ్మలేదన్నారు. కెసిఆర్ ఓ పిట్టల దోర అని, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. ఎంపీగా ఉండి తెలంగాణ కోసం క్క మాట మాట్లాడలేదన్నారు. 2004, 2009లలో ఎన్ని సీట్లు గెలిచారో అందరికీ తెలుసన్నారు.
ఉద్యమంతో కాదు...: శ్రీధర్ బాబు
కెసిఆర్ ఉద్యమంతో కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వలేదని శ్రీధర్ బాబు అన్నారు. ఉద్యమంతోనే వస్తే విదర్భ వంటి వాటి మాటేమిటన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గుర్తించినందువల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెరాస పొత్తు, విలీనం ఉంటుందని తాము ఎప్పుడు భావించలేదన్నారు. సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. తాము ఏ పార్టీపై ఆధారపడి లేమన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు కృషి అమోఘమన్నారు. అధిష్టానాన్ని తాము ఒప్పించకుండానే తెలంగాణ వచ్చిందా అన్నారు.