డిగ్గీకి తలసాని హెచ్చరిక: దమ్ముంటే అడ్డుకోవాలంటూ షబ్బీర్ సవాల్
సిటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను తిరగనివ్వమని హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: సిటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను తిరగనివ్వమని హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీ తరఫున మంత్రిగా కొనసాగుతున్న నీకు దిగ్విజయ్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ విరుచుకుపడ్డారు.
మగాడివైతే, దమ్ముంటే ముందు రాజీనామా చేసిన తర్వాత మాట్లాడు..' అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ పోలీసులు ఫేక్ వెబ్ సైట్లతో ముస్లిం యువకులను ఐఎస్ ఉగ్రవాదంవైపు ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనుచిత వ్యాఖ్యల చేసిన దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పకుంటే హైదరాబాద్లో తిరగనివ్వమని తలసాని హెచ్చరించారు.
కాగా, 'నకిలీ ఐసిస్ వెబ్ సైట్కు సంబంధించి తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ చేసిన ఆరోపణలకు అయన వద్ద పూర్తి స్థాయి ఆధారాలు వున్నాయి. దిగ్విజయ్ని హైద్రాబాద్లో కాలు పెట్టనీయనని తలసాని అంటున్నారు. ఆయనకు సవాలు విసురుతున్నా. దిగ్విజయ్ హైదరాబాద్ రాగానే నీ(తలసాని) ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ పెడతా. దమ్ముంటే అడ్డుకో..' అని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.
కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్సిటీగా మార్చారని, సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ అభివృద్ధి అంతా మాటల్లోనే చూపుతున్నారని, చేతలు మాత్రం శూన్యమని షబ్బీర్ విమర్శించారు. అధికార పార్టీ నాయకుల వేధింపుల కారణంగా నగరంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నాయని షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.