కెవిపి, పొన్నాలలపై శంకరన్న సంచలనం: తగ్గిన రేవంత్
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యుడు శంకర రావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టిక్కెట్ల విషయంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు లాబీయింగ్ చేశారని ఆరోపించారు. కెవిపి కనుసన్నుల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. టిక్కెట్ల కేటాయింపు విషయమై సిబిఐచే దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. తాను కంటోన్మెంటు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. జలయజ్ఞంలో అవినీతిపై పోరాడినందుకు తనకు టిక్కెట్ దక్కలేదన్నారు.
తగ్గిన రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి సీటును ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయాలన్నకున్నప్పటికీ... బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. నామినేషన్పై అప్పుడే తొందరపడవద్దని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించడంతో విరమించుకున్నారు.
అటు రేవంత్కు మల్కాజిగిరి సీటుపై సానుకూలంగా ఉండాలని పార్టీ నేతలు ధూళిపాళ్ల, పయ్యావుల, సుజనా చౌదరిలు చంద్రబాబును కలిసి చెప్పారు. మల్కాజిగిరి సీటు విషయంలో రేవంత్ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై చంద్రబాబు కూడా బిజెపితో మాట్లాడేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొందరపడవద్దని రేవంత్కు పయ్యావుల కూడా సూచించారు.