ముసుగు వ్యక్తులు వెంటాడారు, ముప్పు: శంకరన్న
హైదరాబాద్: తన ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తనను వెంటాడారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను రాష్ట్ర డిజిపి ప్రసాదరావుకు, స్థానిక డిసిపి జయలక్ష్మికి ఫిర్యాదు చేశానని ఆయన సోమవారం మీడియాతో చెప్పారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోనె్మంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అసెంబ్లీకి చేరుకున్నానని, ఆ తర్వాత కొంతసేపటికి ముషీరాబాద్లోని తన నివాసానికి బయలుదేరానని, అయితే ఫార్చునర్ కారులో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తన వెనకాలే వస్తున్న విషయాన్ని గమనించానని అన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే ఆ కారు తమను అనుసరించకుండా వేరే దారిలో వెళ్ళిందని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందున తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ శంకర్రావు నివాసానికి వచ్చి భద్రతను కట్టుదిట్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై పి. శంకరరావు రాసిన లేఖ మేరకు విచారణ జరిపి సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.