నాశనం చేశారు: సొంత పార్టీ నేతలపై శంకర్రావు, దానం లేకుండా గవర్నర్తో భేటీ
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొందరు సొంత పార్టీ నాయకులే నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత శంకర్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ వారే సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వారే కీలక పార్టీ పదువుల్లో కొనసాగుతున్నారని అన్నారు.
అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు గతంలో మంత్రులుగా పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఓడిపోయిందని పి శంకర్రావు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దానం లేకుండానే గవర్నర్తో కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ లేకుండానే మిగితా నేతలు గురువారం గవర్నర్ నర్సింహన్ను కలిశారు. గవర్నర్ కలిసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, బండా కార్తీక, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులున్నారు. నగరంలో పక్కా ఇళ్లు ఇప్పిస్తామంటూ పేదల నుంచి కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సర్కారు పేరుతో దరఖాస్తులు అమ్ముతున్నారని దీనిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, దానం నాగేందర్ పార్టీ మారుతున్నారని, అందుకే కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన లేకుండా గవర్నర్ను కలిసినట్లు తెలుస్తోంది.