పవన్ కోపం చిరంజీవిపైనా.. కాంగ్రెస్పైనా: శంకర్రావు ఫైర్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పవన్ కోపం తన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి పైనా.. లేక కాంగ్రెస్పైనా అని ఆయన ప్రశ్నించారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్, ఎంతో మంది జీవితాలు నాశనం చేశారని శంకర్రావు ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదని అన్నారు. కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితానికి తానే ఉరి వేసుకున్నారని శంకర్రావు ఆరోపించారు.
ఇటీవల నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. రాహుల్ గాంధీకి ఒక్క పెళ్లి కూడా కాలేదని కాంగ్రెస్ ఎంపి హనుమంతరావు అంటున్నారని చెప్పారు. అయితే తాను అందరికీ తెలిసేలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పవన్ తెలిపారు.
రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదన్నారు కానీ.. బ్రహ్మచారి అని వీహెచ్ అనలేదు కాదా.. అందుకు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు పవన్ చెప్పారు. పెళ్లి చేసుకోకుండా రహస్యంగా ఎంత మందితో తిరిగినా.. సహజీవనం చేసినా పరువాలేదా అని పవన్ ప్రశ్నించారు. పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే శంకర్రావు పై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.