సోనియాకు శంకర్రావు గుడి, కూల్చేస్తామని బిజెపి వార్న్
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుడి కడుతున్నానని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యులు శంకర రావు సోమవారం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో సోనియాకు గుడి కట్టేందుకు శంకర రావు నిర్ణయించుకున్నారు.
సోమవారం సోనియా పుట్టిన రోజు కావడంతో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి మహాక్షేత్రం, సోనియా గాంధీ శాంతివనం పేరుతో ఆయన గుడిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని శంకర రావు అన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను సీమాంధ్రలో కూల్చడం దారుణమన్నారు. సీమాంధ్రులు చరిత్రహీనులుగా మారటం ఖాయమన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్థానిక నేతల వైఫల్యమే అన్నారు. ఎపిలో కాంగ్రెసు పార్టీ క్యాడర్ అలాగే ఉందన్నారు.
కూల్చేస్తామని బిజెపి
సోనియా గాంధీకి గుడి కడితే తాము కూల్చివేస్తామని స్థానిక బిజెపి నాయకులు హెచ్చరించారు. నందిగామలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తెలంగాణ విద్యార్థుల చావుకు కారణం సోనియానే అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి గుడి కట్టడం దారుణమన్నారు. దేశమంతా సోనియా, కాంగ్రెసును వ్యతిరేకిస్తుంటే, గుడి ఎలా కడతారని ప్రశ్నించారు. తాము దానిని కూల్చేస్తామని హెచ్చరించారు.