సోనియా తెలంగాణ: శంకరన్న, నోరు జారింది: పితాని
హైదరాబాద్/ ఏలూరు : విభజన తర్వాత ఏర్పడే కొత్త రాష్ట్రానికి 'సోనియా తెలంగాణ' అని పేరు పెట్టాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రజల కోసం ఏర్పాటు చేసిన రచ్చబండలో కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీడపురుగు కంటే హీనుడని, ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి బిస్తర్ సర్దుకోవాల్సిందేనని శంకరరావు వ్యాఖ్యానించారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణను మరో ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్యలపై మంత్రి పితాని సత్యనారాయణ వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయని సీఎం కిరణ్కుమార్రెడ్డి కూడా అన్నారని మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు.
కన్నా లక్ష్మినారాయణను ఉద్దేశించి పితాని సత్యనారాయణ మరో మంత్రి అనడానికి బదులు మరో ముఖ్యమంత్రి అనడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కన్నా ముఖ్యమంత్రిగా వస్తారని ప్రచారం సాగిన నేపథ్యంలో పితాని సంబోధన వేడి పుట్టించింది.