టిపిసిసి చీఫ్ పదవి కోసం శంకర్రావు లేఖ: అవినీతేనని..
నరేంద్ర మోడీ వేవ్ కాదని చెప్పిన ఆయన, కాంగ్రెస్ ఓటమికి అవినీతే కారణమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి పెట్టారని, తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేదని ఆయన ఆరోపించారు. అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి తనకు ఎన్నికల్లో టికెట్ రాకుండా చేశారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముసళ్ల పండుగ: దానం
సెటిలర్స్ను వెళ్లగొడతానంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుకు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్లపండుగేనని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కెసిఆర్ హామీలు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్లో కార్యకర్తలు తక్కువ, లీడర్స్ ఎక్కువగా ఉన్నారని అందుకే కాంగ్రెస్ను సెటిలర్స్ నమ్మలేదని దానం నాగేందర్ చెప్పారు.
తప్పుడు ధృవీకరణ పత్రాలిస్తే క్రిమినల్ కేసులు: శ్రీనివాస్ గౌడ్
సీమాంధ్ర ఉద్యోగులు స్థానికతపై తప్పుడు ధృవీకరణ పత్రాలిస్తే క్రిమినల్ కేసులు పెడ్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3వేల ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్ర సచివాలయంలోనే పని చేయాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ అన్నారు.