ధిక్కారమా: కిరణ్పై శంకరన్న ఫైర్: జగన్ పార్టీపై జగ్గారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నం పెట్టిన వాళ్లకే సున్నం పెడుతున్నారని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యుడు శంకర రావు గురువారం విమర్శించారు. విభజనపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కిరణ్ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పు పట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేడన్నారు.
సోనియా యు టర్న్ తీసుకోరు: జగ్గా రెడ్డి
అన్ని పార్టీలు తెలంగాణపై అభిప్రాయం చెప్పాకనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం నిర్ణయం తీసుకుందని సంగారెడ్డి శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) మెదక్ జిల్లాలో అన్నారు. విభజనపై ఎవరు యూ టర్న్ తీసుకున్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తగ్గరన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుండి సమైక్యవాది అన్నారు. ఉప ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గంలో జరిగిన సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారని గుర్తు చేశారు. ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదన్నారు.
ఢిల్లీకి టాస్క్ఫోర్స్
రాష్ట్రంలో తమ పర్యటన ముగిసిందని ఢిల్లీ వెళ్తున్నామని టాస్క్ఫోర్స్ బృంద చీఫ్ విజయకుమార్ తెలిపారు. ఇవాళ్టితో హైదరాబాదులో అభిప్రాయ సేకరణ పూర్తయిందన్నారు. బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపంతంపై నివేదికలు అందాయని చెప్పారు. మావోయిస్టులు, ఇతర అంశాలకు సంబంధించి అవసరాన్ని బట్టి మోహరింపు ఉంటుందన్నారు.