ఏపీ ప్రజలు వారి హక్కునే అడుగుతున్నారు, కారణాలు సరికాదు: శరద్ యాదవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ల హక్కునే అడుగుతున్నారని జేడీయూ అధినేత శరద్ యాదవ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. వారికి ఆయన ఈ రోజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది ఏపీ ప్రజల హక్కు అన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ హోదా ఇవ్వలేమని చెప్పడం సరికాదన్నారు.
కాగా, ఏపీకి హోదా ఊపిరిలాంటిది అని వైయస్ విజయమ్మ చెప్పారు. హోదా కోసం తాము బీజేపీతో పోరాడుతుంటే టీడీపీ లాలూచీ పడుతున్నారని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. సాక్షాత్తు పార్లమెంటులో, ప్రధాని ఇచ్చిన హామీలకు విలువ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు.
'రెండో రాజధాని, పవన్ వైఖరి చెప్పాలి: బీజేపీ డిమాండ్, 'బీజేపీలో వైసీపీ విలీనానికి ఒప్పందం'
చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్నారని, కానీ చేసిందేమీ లేదన్నారు.హోదా కోసం ఎవరు నిజమైన పోరాటం చేస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంపై వైసీపీ 13సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చిందన్నారు.
హోదా లేదు, ప్యాకేజీ లేదు
ఏపీకి హోదా ఇస్తామని, ఆ తర్వాత ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, కానీ ఏదీ లేదని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు, ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీకి గౌరవం లేదని ఆఱోపించారు. బీజేపీ మాటలను నమ్మి టీడీపీ హోదాకు బదులు ప్యాకేజీ అంగీకరించిందన్నారు. కానీ ఆ రెండూ లేవన్నారు.