జగన్ గురించి ఇంత తెలియదు, ఎందాకైనా: షర్మిల, రాధాకృష్ణపై..
వైయస్ ఉన్నప్పుడు ఎప్పుడు బయట అడుగు పెట్టని అమ్మ విజయమ్మ తన తండ్రి చనిపోయాక ఆన ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రం కోసం బయటకు వచ్చి నాలుగేళ్లలో ఎంతో నేర్చుకున్నారన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీకి లొంగలేదని కేసులు పెట్టి బెదిరించారని, సిబిఐని అడ్డు పెట్టుకొని వెంటాడారన్నారు. అబద్దపు కేసులు బనాయించి జగన్ను జైలుకు పంపించారని, వైయస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్లో పెట్టారని ఆరోపించారు.
జగన్ను జైలులో పెట్టినా చెక్కు చెదరలేదన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని జగన్ నిరూపించుకున్నారన్నారు. జగన్ ఇంత నిబ్బరం కలిగిన వాడని తనకు కూడా తెలియదని, తామను ఏం చేసినా తట్టుకోగలమని కానీ పేదవారికి ఇబ్బందులు సృష్టిస్తే వారు తట్టుకోగలరా అన్నారు. బీదవారు తట్టుకోలేరన్నారు. జగన్ కష్టాలకు లొంగలేదని, కుట్రలకు కుంగిపోలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొన్న బలవంతులతో ఒక్క అడుగు వెనక్కి వేయకుండా పోరాడారన్నారు.
వైయస్ను కోల్పోవడం దురదృష్టకరమని కానీ దేవుడు చాలా మంచివాడని, అందుకే ఈ రాష్ట్ర ప్రజలను అనాథలుగా వదిలేయకుండా జగన్ను ఇచ్చారన్నారు. జగన్ వైయస్ అంతటి వారు అవుతారన్నారు. వైయస్ను మనమంతా జగన్లో చూసుకుంటామన్నారు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమన్నారు. జగన్కు దేవుడి దయ, కోట్లాది ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. జగన్ వెంట అందరూ సింహాలై నడవాలన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల గూబ గుయ్ మనేలా చేయాలన్నారు. ప్రత్యర్థులకు కండ బలం, అధికార బలం, ధనం బలం ఉందని, జగన్కు మాత్రం దేవుడి దయ, ప్రజల అండ ఉందన్నారు. కాంగ్రెసు, టిడిపి ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ను ప్రజల గుండెల నుండి తీసివేయలేకపోయారన్నారు. తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని, ఆయన ఈ బాణాన్ని వదిలితే ఎందాకైనా వెళ్తానని, ఏమైనా సాధించుకొస్తానని చెప్పారు.
ఆంధ్రజ్యోతి, మీడియాపై ఫైర్
ప్లీనరీలో షర్మిల ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ఓ వర్గం మీడియాపై మండిపడ్డారు. సుబ్బా రెడ్డి చిన్నాన్నకు, తనకు ఎంతో అన్యాయం జరుగుతోందని, జగన్ తమను తొక్కేస్తున్నాడని కనీస విలువలు లేకుండా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను, చిన్నాన్నను ఎంపీలుగా నిలబడమని జగన్ ఎప్పుడు చెప్పులేదన్నారు.
విభజన
విభజనకు జగన్ కారకులని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయని కానీ రాష్ట్రాన్ని విడదీస్తోంది సోనియా అని, సులభం చేస్తోంది కిరణ్ అని, లేఖ ఇచ్చింది చంద్రబాబు అని అలాంటి వారిని అనకుండా జగన్ను అనడమేమిటని ప్రశ్నించారు. సబ్బం హరి, రఘురామ కృష్ణం రాజులు తన సోదరుడిని విమర్శించడం సరికాదన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నారన్నారు.