పవన్ కళ్యాణ్ "కవాతు" సభలో కూలిన రేకుల షెడ్డు...తప్పిన ముప్పు
తూర్పు గోదావరి:పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన ఆధ్యర్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై నిర్వహించిన "కవాతు" కార్యక్రమంలో పెను ముప్పు తప్పింది. కవాతు అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్న బహిరంగ సభా వేదిక సమీపంలోని ఓ పాత రేకుల షెడ్డు జనాల తాకిడికి తట్టుకోలేక కుప్పకూలింది.
Recommended Video
యితే ఈ ప్రమాదంలో చిన్నదెబ్బలు మినహా ఎవరికీ తీవ్రగాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తొలుత ఈ ప్రమాదం కారణంగా పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరగడంతో ఆందోళన నెలకొంది. అయితే ఆ తరువాత అవి వట్టి వదంతులేనని తెలిసి ఊరట చెందారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతుకు జనాలు వెల్లువెత్తారు. సుమారు మూడు గంటలపాటు కవాతు సాగింది. సోమవారం సాయంత్రం 3.30 గంటలకు మండలం లోని పిచ్చుకలంక వద్దకు విచ్చేసిన జనసేనాని తన జనసైనికులకు అభివాదం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనాలు సభా స్థలివద్దకు బ్యారేజ్ పై నుంచే కాకుండా కాటన్ పాత ఆనకట్ట మీదుగా కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ అభివాదం తెలుపుతుండగా పారాగ్లైడర్ సాయంతో నింగి నుంచి కడియం నర్సరీ రైతులు పూలు చల్లడం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పవన్ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు కొందరు అభిమానులు పవన్ సరిగ్గా కనిపించడం లేదంటూ సభా స్థలికి సమీపంలో ఉన్న ఒక పాత రేకుల షెడ్డు పైకి ఎక్కారు. అయితే అప్పటికే శిధిలావస్థలో ఉన్న ఆ రేకుల షెడ్డు అభిమానుల బరువు ఓపలేక కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో స్వల్పగాయాలే అవడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థను మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. ఒక బలమైన వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యాన్ని తాను కలిగి ఉన్నట్లు స్పష్టం చేశారు.తమ తండ్రి చిన్నప్పటి నుంచే ఉన్నతమైన విలువలు నేర్పించారంటూ అదే రీతిలో ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. పాడైపోతున్న ఈ వ్యవస్థను చూసి చలించిపోయానని...తన వద్ద రూ.కోట్లు లేవని...అయినా విలువలతో పనిచేస్తానని తేల్చిచెప్పారు.