ఆ ముహూర్తమే ఖాయం చేసుకున్న వైఎస్ జగన్? పరిపాలన రాజధానిగా విశాఖకు తొలి పండుగ అదే
అమరావతి: మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ముందడుగు వేయబోతున్నారా?, దీనికోసం ముహూర్తాన్ని కూడా ఖాయం చేసుకున్నారా? వచ్చే దసరా నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దేవీ నవరాత్రులు ఆరంభం అయ్యే సమయానికి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించవచ్చని పేర్కొంది.
కరోనా బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే: మంత్రి కుటుంబ సభ్యుల్లోనూ: హోమ్ క్వారంటైన్: ఆందోళనలో
ఆలస్యమే తప్ప..
ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ దినపత్రిక ఈ కథనాన్ని రాసుకొచ్చింది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో కొంత ఆలస్యం ఏర్పడినప్పటికీ.. అది పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయం తేటతెల్లమైంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దీనితో ప్రభుత్వ ఉద్దేశమేమిటనేది వెల్లడైంది.
విశాఖకు తరలి వెళ్లడంపై
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని అధికార వర్గాలు స్పష్టం చేసినట్లు ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని అంచనా వేసింది. అక్టోబర్ 25వ తేదీన విజయదశమి. అప్పటికల్లా ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిపింది. తొలిదశలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు ఆఫీస్, అనంతరం సచివాలయం కూడా మార్చబోతున్నారని స్పష్టం చేసింది.
మాజీ ముఖ్యమంత్రి అల్లుడి ఇంజినీరింగ్ కళాశాలలో..
భీమిలీ సమీపంలో మూతపడిన ఓ ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చని ఈ కథనం ద్వారా తెలుస్తోంది. విశాఖ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. పైడా ఇంజినీరింగ్ కాలేజీ కాగా.. మరొకటి కౌశిక్ ఇంజనీరింగ్ కాలేజీ. సుమారుగా 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కే రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్ చెందిన కళాశాలలు అవి. నాలుగేళ్ల కిందటే కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల మూతపడింది. ప్రస్తుతం పైడా ఇంజినీరింగ్ కళాశాల మాత్రమే నడుస్తోంది. అందులో కూడా రెండేళ్ల నుంచి అడ్మిషన్లను నిలిపివేశారు. వాటిని సచివాలయంగా మార్చవచ్చని సమాచారం.
Recommended Video
అక్టోబర్ 25 నాటికి సచివాలయాన్ని తరలించేలా
అక్టోబర్ 25వ తేదీ నాటికి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తారంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. దీన్ని బలపరుస్తూ ఈ కథనం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు దసరా నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని విశాఖ శారదా పీఠం తోసిపుచ్చింది. తాము ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అదే ముహూర్తాన్ని వైఎస్ జగన్ ఖాయం చేసుకున్నారంటూ తాజా కథనం స్పష్టం చేసింది.