పడట్లేదా?: బాబు పర్యటనకు శిల్పా చక్రపాణి ఎందుకు రాలేదు, అఖిలప్రియతో విభేదాలా?
మంత్రి అఖిలప్రియతో ఏర్పడిన గ్యాప్ వల్లే ఆయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు: టీడీపీ రాజకీయాలతో పూర్తిగా చెడ్డ శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఆయన పార్టీలో ఉండటమైతే ఉన్నారు గానీ సీఎంతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తుండటం చర్చకు తావిస్తోంది.
శనివారం సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు రాగా.. చక్రపాణిరెడ్డి మాత్రం దూరంగానే ఉన్నారు. సీఎం పర్యటనలో చక్రపాణి రెడ్డి కనిపించకపోవడంతో.. కారణమేంటా? అన్న ఆరా మొదలైంది. మంత్రి అఖిలప్రియతో ఏర్పడిన గ్యాప్ వల్లే ఆయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అఖిలప్రియ అందరిని కలుపుకుని వెళ్లకపోవడం.. పార్టీలోను ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుండటం శిల్పా చక్రపాణికి రుచించడం లేదని తెలుస్తోంది. సీనియర్లతో అఖిలప్రియ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు వల్లే చక్రపాణి సీఎం పర్యటనలో పాల్గొనలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు అఖిలప్రియ వర్గం వాదన మరోలా ఉంది. ఉద్దేశపూర్వకంగానే శిల్పా చక్రపాణి పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఉపఎన్నిక నేపథ్యంలోనే.. సీఎం రెండోసారి నంద్యాలలో పర్యటిస్తున్నారన్న విమర్శ కూడా ఉంది.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భ:గా.. 10మంది డీఎస్పీలు, 23మంది సీఐలు, 86మంది ఎస్ఐలు, 254మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 654మంది కానిస్టేబుల్స్, 46మంది మహిళా పోలీసులు, 300మంది హోంగార్డులు ఇతర బలగాలను ఏపీ పోలీస్ యంత్రాంగం వినియోగిస్తోంది.