బోటు వెలికితీతపై మరోమారు సవాల్ చేసిన సాహసవీరుడు శివ.. రెండు గంటల్లో బోటు బయటకు తీస్తా
కచ్చులూరు వద్ద గోదావరి లో మునిగిన బోటును బయటకు తీయడానికి అధికారులు విఫలయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీయటానికి అవకాశం ఇచ్చిన అధికారులు బోటు వెలికితీతలో మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. బోటును వెలికితీయలేమని ధర్మాడి సత్యం టీం చేతులెత్తేసింది.
కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపు
బోటు వెలికితీత ఆపరేషన్ లో మూడుసార్లు ఫెయిల్ అయిన ధర్మాడిసత్యం బృందం
బోటు వెలికితీత ఆపరేషన్ ఏపీ సర్కార్ కు సవాల్ గా మారింది. మూడు రోజులుగా బోటును ఒడ్డుకు తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైతే బోటు మునిగిపోయిందో అదే ప్రాంతంలో గోదావరి ఇంకా సుడులు తిరుగుతోందని వారు చెప్తున్నారు .ఇక ధర్మాడి సత్యం బృందం ఫెయిల్ కావటంతో ఇప్పుడు మరోమారు పశ్చిమగోదావరి జిల్లా పసివేదల కు చెందిన గుల్లా వెంకట శివ బోటును రెండు గంటల్లో వెలికితీస్తానని సవాల్ విసురుతున్నాడు .
రెండు గంటల్లో బోటు వెలికితీస్తానని గతంలోనే సవాల్ చేసిన శివ
ఇటీవల రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన శివ బోటు ప్రమాదాలు జరిగిన సందర్భంలో గతంలో తన అనుభవాలను వాడుకున్న విధానాన్ని చెబుతూ ప్రస్తుత బోటు ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మంటూరు-వాడపల్లి మధ్య బోటు మునిగినప్పుడు బయటకు తీసిన శివ బోటు బయటకు తీయడం అధికారులకు, మంత్రులకు ఇష్టం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పశివేదలకు చెందిన గుల్లా వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజు తాను బోటు జాడను గుర్తించానని , బయటకు తీయడానికి సహకారం కావాలని అడిగానని చెప్పారు. పర్యాటకశాఖ అధికారులు, మంత్రులు, బోటు యజమానులు అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని పేర్కొన్న శివ తనకు అవకాశమిస్తే రెండుగంటల్లో బోటును బయటకు తెస్తానన్నారు.
ఇప్పుడు మరోమారు అవకాశం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్న శివ
ఇప్పుడు మరోమారు కేవలం రెండు గంటల్లోనే బోటును వెలికితీస్తానంటూ ముందుకొచ్చాడు ఈ సాహసవీరుడు . కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే పనులు ధర్మాడి సత్యం బృందానికి అప్పగించకముందే శివ తాను బోటు బయటకు తెస్తానని చెప్పారు . సర్కారు మాత్రం బాలాజీ మెరైన్స్ సంస్థపై నమ్మకం తో అవకాశం ఇచ్చింది. ధర్మాడి సత్యం ఆధ్వర్యంలోని బాలాజీ మెరైన్స్ మూడు రోజుల పాటు శ్రమించినా బోటు ఆచూకీ కనిపెట్టలేకపోయింది. దీనిపై స్పందించిన శివ ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని మరోమారు అడుగుతున్నారు.
బోటు తియ్యలేకపోతే సాహసవీరుడిగా ఇచ్చిన అవార్డులు వెనక్కి ఇస్తా అన్న శివ
రెండు గంటల్లో బోటు ఎక్కడుందో చూపించడమే కాకుండా, వంద శాతం బయటికి తీస్తానని సవాల్ చేస్తున్నాడు . అంతేకాదు తనను బోటు వెలికితీత పనుల్లో ఉపయోగించుకోవాలని సర్కారుకు, ధర్మాడి సత్యం బృందానికి చెప్పినా, వారు తన సేవలను వినియోగంచుకోలేదని శివ మీడియాకు వెల్లడించాడు. తనను బయటే ఉండమని చెప్పి వారు నదిలో ఆపరేషన్ నిర్వహించారని కానీ ఫెయిల్ అయ్యారన్నారు శివ . బోటు ఎక్కడ ఉందో తాను మొదటే మార్కింగ్ చేశానని చెప్తున్న శివ ఒకవేళ తాను బోటును బయటికి తీయలేకపోతే సాహసవీరుడిగా తనకు వచ్చిన అవార్డులన్నిటినీ వెనక్కి ఇచ్చేస్తానని పేర్కొన్నారు. మరి చూడాలి సర్కార్ శివ కు అవకాశం ఇస్తుందో లేదో ...ఒకవేళ అవకాశం ఇస్తే శివ బోటు వెలికితీతలో సక్సెస్ అవుతారో లేదో ..