టిటిడి చైర్మన్కు సుధాకర్: క్రిస్టియన్ సంస్థలతో.. ఆయన వద్దని శివస్వామి సంచలనం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది.
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని టిడిపిలోకి రప్పించుకునే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో డీఎల్కు మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలంటే సుధాకర్కు పదవి ఇవ్వాల్సి ఉంది.
సుధాకర్ యాదవ్కు టిటిడి చైర్మన్పై రగడ
ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్కు టిటిడి చైర్మన్ పదవి కట్టబెట్టాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది. కానీ దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిటిడి చైర్మన్గా సుధాకర్ యాదవ్ నియామకం తగదని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు.
క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితమని సంచలన వ్యాఖ్యలు
హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్న వారికే టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని శివస్వామి అన్నారు. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితంగా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
క్రిస్టియన్ సభలకు హాజరయ్యారు
సుధాకర్ యాదవ్ పలుమార్లు క్రిస్టియన్ సభలకు హాజరయ్యారని శివస్వామి ఆరోపించారు. కాబట్టి సుధాకర్ను టిటిడి చైర్మన్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేను పక్కా హిందువును
కాగా, శివస్వామి ఆరోపణలపై సుధాకర్ యాదవ్ స్పందించారు. తాను పక్కా హిందువును అని, క్రిస్టియన్ సంస్థలకు తాను మద్దతిస్తున్నానని చెప్పడం సరికాదన్నారు. పీఠాధిపతులు అంటే తనకు ఎనలేని గౌరవం అని చెప్పారు.
హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నా
హిందూ ధర్మం కోసం తాను పాటుపడుతున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ ఆహ్వానిస్తారని, కార్యకర్తల పిలుపు మేరకు ఆయా కార్యక్రమాలకు హాజరు కావడం సహజమే అన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లతో తనకు సంబంధం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కూడా దేవాలయాల నిర్మాణానికి టిటిడి బోర్డు మెంబర్గా నిధులు కేటాయించినట్లు చెప్పారు.