బాబుకు మరో షాక్: 'పవన్కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో నేను అంతే, ఐనా'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే షాకిస్తున్నారు. మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పతివాడ నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు కర్నూల వైపు చూడటం లేదని కేఈ ఆన్నారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారు. గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు పదవి రానందుకు పతివాడ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా వాసులను సీఎం మంచివారు అని అంటుంటారని, అందుకే మమ్మల్ని ఇక్కడే ఉంచారని రెండు రోజుల క్రితం అన్నారు. వైద్య కళాశాల విషయంలో చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా తన అసహనం వ్యక్తం చేశారు. అయితే, వారి వ్యాఖ్యల పైన మంత్రి దేవినేని సోమవారం స్పందించారు. వారి వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు.
తాజాగా.. మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తాను ఎంతో శ్రమించానని, అయినా గుర్తింపు లేదన్నారు. ఎన్నికల ముందు, తనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని శివాజీ అన్నారని తెలుస్తంది. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో.. నేను అంతే కష్టపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.