నంద్యాల షాక్: అఖిలప్రియపై 'సొంత' పార్టీ పావులు, రంగంలోకి ప్రత్యర్థులు!
తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీతో చిక్కులు మొదలయ్యాయా? నంద్యాల ఉప ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థులు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కర్నూలు: తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీతో చిక్కులు మొదలయ్యాయా? నంద్యాల ఉప ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థులు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
భూమా కుటుంబానికి, శిల్పా సోదరులకు మొదటి నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే వైసిపి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు టిడిపిలో చేరుతానంటే శిల్పా సోదరులు అసంతృప్తికి లోనయ్యారు. ఇరువర్గాలతో సీఎం చంద్రబాబు మాట్లాడి, భూమాను చేర్చుకున్నారు.
ఆ తర్వాత, భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇస్తూ, శిల్పా కుటుంబానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అలా ఇరువర్గాలను సంతృప్తిపరుస్తూ వస్తున్నారు. అసంతృప్తితో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదేశాల కారణంగా ఇరువర్గాలు మౌనం వహించాయి.
అఖిలప్రియకు చుక్కలేనా.. తండ్రి మృతితో తెరపైకి 'రాజకీయం'
భూమా నాగిరెడ్డి మృతి అనంతరం ఇటీవలే ఆయన తనయ అఖిలప్రియను కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే, భూమా మృతితో నంద్యాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. ఇక్కడే చిక్కు వచ్చి పడింది. భూమా స్థానం కాబట్టి అఖిల కుటుంబం నుంచి లేదా ఆమె సూచించిన వ్యక్తికి టిక్కెట్ దక్కుతుందని అందరూ భావించారు.
కానీ, ఇప్పుడు అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అదే అఖిలప్రియకు రాజకీయంగా చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. నంద్యాల టిక్కెట్ కోసం శిల్పా వర్గం, ఎస్పీవై రెడ్డి, ఫరూక్లు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా రంగంలోకి దిగారని అంటున్నారు.
టిడిపిలో వర్గ పోరు.. సీటు కోసం ప్రయత్నాలు!
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు జరిగే ఉప ఎన్నికల్లో టికెట్ తమకు ఇవ్వాలంటే, తమకు ఇవ్వాలని టిడిపిలో వర్గ పోరు ప్రారంభమైందని, ఈ ప్రాంతంలోని పలువురు నేతలు అధిష్ఠానానికి ఇప్పటికే సంకేతాలు పంపడాన్ని ప్రారంభించారని ప్రచారం సాగుతోంది.
పావులు కదుపుతున్న శిల్పా వర్గం
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టిడిపి టికెట్ తనకు కావాలని కోరుతూ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సైతం ఆదివారం తన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. టికెట్ను ఆశిస్తున్న ఎస్పీవై రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా, సీటు తమ కుటుంబానిదే కాబట్టి, ఈ అవకాశం తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, భూమా కుటుంబం నుంచి బ్రహ్మానందరెడ్డి రంగంలోకి దిగారు.
చంద్రబాబు మనసులో ఏముంది?
తనకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. భూమా కుటుంబానికి సీటు ఇవ్వవద్దని చెప్పారని సమాచారం. ఈ మేరకు ఆయన కార్యకర్తలతోను సంప్రదింపులు జరుపుతన్నారని తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరని తెలుస్తోంది.
ఫరూక్ ఆశలు
నంద్యాలలో ముస్లిం ఓటర్లు గెలుపును ప్రభావితం చేసే సంఖ్యలో ఉండటంతో తనకు అవకాశం ఇవ్వాలని ఫరూక్ డిమాండ్ చేస్తున్నారు. రెండు దఫాలుగా తన పేరును పరిగణలోకి తీసుకోకపోడంతో.. ఈసారైనా అవకాశమివ్వాలని కోరనున్నారని తెలుస్తోంది.
తెరపైకి బ్రహ్మానంద రెడ్డి
ఈ సీటు తనకు వస్తుందన్న నమ్మకంతో బ్రహ్మానంద రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. భూమా అనుచరులంతా తనవెంటే ఉన్నారన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే సరేనని, లేకుంటే మాత్రం తనకు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో నంద్యాలలో రాజకీయ వేడి కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఆళ్లగడ్డ, నంద్యాల బాధ్యత అఖిలప్రియపై ఉంది. ఆమె ఏ మేరకు పార్టీలని ప్రత్యర్థులపై నెగ్గుకు వస్తారో చూడాల్సి ఉంది.