వైసిపి నేత హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కెఈకి షాక్....
కర్నూలు: వైసిపి నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తికు పెద్ద షాక్ తగిలింది. ఈ హత్యకు కెఈ కృష్ణమూర్తి కొడుకు కెఈ శ్యాంబాబే అసలు సూత్రధారుడిగా మృతుడి భార్య ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కెఈ శ్యాంబాబు మీద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తికొండ నియోజకవర్గంలో కెఈ కృష్ణమార్తి, చెరుకులపాడు నారాయణరెడ్డి ప్రత్యర్ధులన్నవిషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సన్నాహాల్లో ఉన్న నారాయణరెడ్డి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్యకు కెఈ కృష్ణమూర్తి కొడుకు కెఈ శ్యాంబాబే అసలు సూత్రదారునిగా మృతుడి భార్య, వైసిపి నేతలు ఆరోపించారు. అయినప్పటికి పోలీసులు శ్యాంబాబుని అరెస్ట్ చెయ్యకుండా మరి కొందరిని మాత్రం అరెస్టు చేసారు.
దీంతో ఈ హత్య పథకంలో అసలు సూత్రధారులను వదిలేయట మేమిటని వైసిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. దీనికి పోలీసుల జవాబేంటంటే పోలీసు రికార్డుల ప్రకారం శ్యాంబాబు పరారీలో ఉన్నారట. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కెఈ శ్యాంబాబు ప్రతీ కార్యక్రమానికి హాజరవుతూనే ఉన్నారు. దాంతో హతుడి భార్య శ్రీదేవి రెడ్డి ఈ విషయమై కోర్టులో కేసు కూడా వేశారు. తన భర్త హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబే ప్రధాన సూత్రధారిగా శ్రీదేవి పిటీషన్లో పేర్కొన్నారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది.
శ్రీదేవీరెడ్డి వేసిన పిటీషన్ పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి వెంటనే కెఇ శ్యాంబాబు మీద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అంతేకాదు కెఈ శ్యాంబాబును ఈ కేసు నుంచి తప్పించిన వెల్దుర్తి ఎస్సై తులసీ నాగప్రసాద్ పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.