చెల్లదు: ఆరడుగుల బుల్లెట్ అశోక్ బాబుకు షాక్
హైదరాబాద్: సమైక్య ఉద్యమాన్ని నడిపించిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు షాక్ తగిలింది. ఎపిఎన్జీవోల హౌసింగ్ సొసైటీలో ఆయన సభ్యత్వం చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సహకార ట్రిబ్యునల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సొసైటీ పాలక వర్గం పగ్గాలను చేజిక్కించుకోవాలనుకున్న ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకు అందలేదని, ఈ క్రమంలో ఇప్పటికే ఖరారైన షెడ్యూలు మేరకు సొసైటీ పాలకవర్గ సమావేశం జరిగిందని ఎపిఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సొసైటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అశోక్ బాబును కో ఆప్షన్ సభ్యునిగా, అటుపై సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకుంటూ తీర్మానించామంటున్నారు. కాగా ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించేందుకు అశోక్ బాబు బృందం యోచిస్తోంది.
ఎపిఎన్జీవోలకు ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన ఎపిఎన్జీవోస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అశోక్ బాబు సభ్యత్వం తీసుకున్నారు. సొసైటీ నిబంధనల మేరకు ఈ సభ్యత్వం చెల్లదని ఉద్యోగవర్గాలు తెలిపాయి. సొసైటీకి గతంలో అధ్యక్షునిగా ఉన్న ఎపిఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి.. తన పదవికి అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
అప్పటి నుంచి అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంటూ వచ్చింది. ఎపిఎన్జీవోల అధ్యక్షునిగా ఉన్న గోపాల్ రెడ్డి కిందటి సంవత్సరం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో మొదట అడ్హాక్ అధ్యక్షునిగా, ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 5న జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయి అధ్యక్షునిగా అశోక్ బాబు ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యేందుకు వ్యూహం రచించారు.