హైకోర్టులో చంద్రబాబుకు 'సదావర్తి' షాక్, దేవుడ్నే లెక్కచేయట్లేదని ఆళ్ల ఆగ్రహం
అమరావతి: సదావర్తి సత్రం భూముల వేలం కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మంగళవారం నాడు షాక్ తగిలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి చెప్పింది.
సదావర్తి భూముల వేలం వ్యవహారం కొద్ది రోజుల క్రితం అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే.
కొందరికి లబ్ధి చేకూర్చేందుకే మార్కెట్ విలువ కంటే తక్కువకు భూములు విక్రయించారని మంగళగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల పైన ఆళ్ల స్పందించారు. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సత్రం భూములు అమ్మిన వారికి తక్షణమే సేల్ సర్టిఫికేట్ ఇవ్వరాదని కోర్టు ఆదేశించిందని తెలిపారు. దేవుడిని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయడం లేదని మండిపడ్డారు.
కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూమిని ఎకరం కేవలం రూ.26 లక్షలకే అమ్మాలని చూడటం సరికాదన్నారు. చంద్రబాబు బినామీలకు మేలు చేసేందుకు దేవాలయ భూములు కూడా వదలటం లేదన్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1000 కోట్ల విలువైన 83 ఎకరాలకు పైగా సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో కొందరు దక్కించుకున్నారని సాక్షి పత్రికలో వచ్చింది. అత్యంత విలువైన సత్రం భూములను తక్కువ ధరకే అమ్మడంపై వైసిపి విమర్శలు గుప్పించింది.