కాంగ్రెస్కు షాక్: జగన్తో చేయి కలిపిన ఎంపి అనంత
హైదరాబాద్: అధికార కాంగ్రెసు పార్టీకి అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి బుధవారం షాక్ ఇచ్చారు. సమైక్యాంధ్రను కోరుతూ లోటస్ పాండులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనంత సంఘీభావం తెలిపారు. అంతేకాదు, కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ను పరామర్శించారు.
సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది జగన్ ఒక్కరేనని ప్రశంసించారు. అందుకే ఆయన దీక్షకు మద్ధతు తెలుపుతున్నట్లు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే ప్రకటిస్తానని కూడా తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడుగా వెళుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను, తమను మోసం చేసిందని మండిపడ్డారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చాకే ముందుకు వెళతామని చెప్పి, తర్వాత మాట తప్పిందని ధ్వజమెత్తారు.
తాజాగా ఏర్పాటైన మంత్రుల కమిటీలోనూ అన్యాయమే చేశారని రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రినీ ఇందులో నియమించలేదని విమర్శించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని జగన్ దీక్షా శిబిరం వద్ద చెప్పిన అనంత వెంకట్రామి రెడ్డి ఆ తర్వాత ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు.
తనకు ఆ పార్టీలో చేరే ఉద్దేశమేదీ లేదని మీడియాకు తెలిపారు. ఓ సమైక్యవాదిగా మద్దతు తెలపడానికే జగన్ శిబిరానికి వెళ్లినట్లు ఆయన చెప్పారు. సమైక్యవాణి వినిపించే పార్టీలకు, నేతలకు మద్దతివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పార్టీ మారడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బలమైన సమైక్య వాదిగా ముద్ర వేసుకున్న ఆయన రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం మొండిగా వ్యవహరించడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు అనంతపురంలోని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తమ అభిప్రాయానికి కనీస విలువ ఇవ్వని పార్టీలో కొనసాగడం ఇక కష్టమేనని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.ఈ నేపథ్యంలో జగన్ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందట. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.