డికె అరుణకు ఎదురుగాలి, వీరికి ఒక్క ఓటు పడలేదు
హైదరాబాద్: మాజీ మంత్రి డికె అరుణకు తన సొంత నియోజకవర్గం గద్వాలలో ఎదురుగాలి వీచింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పినట్టు మహిళా నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంటే.. ఆ లిస్టులో డికె అరుణ ముందువరుసలో ఉంటారు. అయితే ఇప్పుడు గద్వాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెసు పార్టీ గెలుచుకోక పోవడం ఆమెకు జీర్ణించుకోలేదని అంశమే.
వీరికి ఒక్క ఓటు పడలేదు
ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసే అభ్యర్థికి కనీసం కుటుంబ సభ్యుల ఓట్లైనా పడతాయి. కనీసం తన సొంత ఓటైనా తనకు వేసుకుంటారు. కానీ, పరిషత్, పురపాలక ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. కొంతమంది అభ్యర్థులకు కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు.
అంటే వారి సొంత ఓటును కూడా తనకు వేసుకోకుండా ఇతరులకు వేశారన్న మాట! ఇల్లెందు పురపాలక సంఘంలోని 14వ వార్డు నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్కు ఒక్క ఓటు కూడా పడలేదు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల 11వ వార్డులోని స్వతంత్ర అభ్యర్థి కుసుమ చంద్రశేఖర్, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని బీఎస్సీ అభ్యర్థి సుధాకర్లు కూడా తమ ఖాతాను తెరవలేకపోయాయి.
మజ్లిస్ హవా
హైదరాబాదులోని పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన పరిధిని విస్తరించుకుంది. ముస్లింల ఆధిక్యత లేని ప్రాంతాల్లో కూడా హిందువులకు టికెట్లిచ్చి మంచి ఫలితాలను రాబట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న సరూర్ నగర్ మండలం బాలాపూర్ పరిధిలోని ఆరు ఎంపీటీసీలను గెలుచుకుని స్వీప్ చేసింది. కొత్తపేటలోని ఏడు ఎంపీటీసీలకు ఏడింటినీ గెలుచుకుంది. మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో (గ్రేటర్ హైదరాబాద్ పరిధి) 14 ఎంపీటీసీలను గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది.