పశ్చిమంలో జగన్ కు షాక్...జనసేనలోకి వైసీపీ కీలక నేత
పశ్చిమ గోదావరి:పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన వైసిపికి షాక్ లా పరిణమించగా...జనసేన పార్టీలో మరింత జోష్ నింపింది. జిల్లాలోని తణుకు నియోజకవర్గంకు చెందిన వైసిపి నేత విడివాడ రామచంద్రరావు ఆ పార్టీ విడి జనసేనలో చేరడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.
మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విడివాడ రామ చంద్రరావు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పేరుకు వైసిపి నేతే అయిన చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోకుండా ఇంటికే పరిమవుతూ వచ్చిన ఆయన ఉన్నట్టుండి జనసేన పార్టీలో చేరడం పశ్చిమం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
జనసేన లోకి...ఇలా
విడివాడ రామచంద్రరావు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున తణుకు టిక్కెట్ ఆశించారు. ఆ ఉద్దేశంతోనే నియోజక వర్గంలో విస్తృతంగా తిరిగారు. తరువాత టిక్కెట్ దక్కకపోవడం, పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో ఆ తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుదలతో ఉన్న ఆయనకు జనసేన నుంచి తాను కోరుకున్న ఆఫర్ లభించిందట. దీంతో ఆయన మరింకేమీ ఆలోచించకుండా జనసేనలో చేరిపోయారు.
జనంలోకి...జనంతో...జనసేన లోకి
కారణాలేవైనా ఇప్పటి వరకు తెరచాటున నిలుస్తూ వచ్చిన విడివాడ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలిసింది. మరోవైపు చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుండటం మెగా అభిమానులకు ఇబ్బందికరంగా మారగా తాజాగా చిరంజీవి అభిమానులు జనసేనలో చేరుతుండటం విడివాడలాంటి నేతలను చైతన్యపరుస్తోంది. టిడిపి,వైసిపి నుంచి ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందన్న నమ్మకం లేని కొందరు ముఖ్య నేతలు జనసేనలోకి చేరేందుకు ఈ విధమైన పరిణామాలు ప్రోత్సాహం కలిగిస్తున్నాయి.
భారీ ర్యాలీగా...చేరిక
విడివాడ రామచంద్రరావు సోమవారం తణుకు రూరల్ మండలం మండపాక గ్రామంలోని తన నివాసం నుంచి జనసేన కార్యకర్తలతో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. మండపాక నుంచి పైడిపర్రు మీదుగా తణుకు రాష్ట్రపతి రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగించారు. తణుకు ఏరియా ఆసుపత్రి వద్ద గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇరగవరం, అత్తిలి మండలాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆ విధంగా జనసేనలో జోష్ నింపేందుకు విడివాడ తన ప్రయత్నం చేశారు.
విడివాడ రాకతో...బలోపేతం
జనసేనలోకి విడివాడ రాకతో నియోజకవర్గంలో తమ పార్టీ బలం పుంజుకుంటుందని జనసేన నేతలు ఆశపడుతున్నారు. తణుకు పట్టణం, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని మరి కొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైసీపీలో కీలకంగా పనిచేసిన తణుకు పాతూరుకు చెందిన ఒక వ్యక్తి విడివాడ రామచంద్రరావుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ మంతనాల సారాంశం ఏమిటనేది బయటకు పొక్కలేదు. ఏదేమైనా విడివాడ నిర్ణయం జగన్ చిన్న పాటి షాక్ అనే చెప్పుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.