జెపికి పవన్ షాక్: టిడిపి ఖాతాలో మల్కాజిగిరి సీటు
హైదరాబాద్: తెలంగాణలోని మల్కాజిగిరి లోకసభ స్థానంలో పోటీ చేయడానికి తెలంగాణ నేతల కన్నా సీమాంధ్ర నేతలు ఎక్కువ ఆసక్తి చూపారు. మల్కాజిగిరి సీటు కోసం పోటీ పడ్డారు. లోకసభకు వెళ్లి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరాలని ఉత్సాహం ప్రదర్సించిన లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు మల్కాజిగిరిలో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం మల్కాజిగిరి విషయంలో ఫలించినట్లే ఉంది.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి జెపి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ఆయనకు పోటీ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం వెనక టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఫలించింది. జెపికి బిజెపి మద్దతు ఇవ్వకుండా, పొత్తు ధర్మంలో భాగంగా తమకే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టారు. జెపి స్వయంగా నరేంద్ర మోడీని కలిసినా ఆయన బిజెపి మద్దతు లభించలేదు.
మల్కాజిగిరిలో జెపికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు పని కట్టుకుని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి స్నేహహస్తం అందించాలని కోరారు. దాంతో పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మంలో భాగంగా జెపికి ప్రచారం చేయడానికి నిరాకరించారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోవడంపై జెపి ఒకానొక సమయంలో అసహనం కూడా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ నాగేశ్వర్ అత్యుత్సాహంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సిపిఎం సానుభూతిపరుడైన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నారు. తెలంగాణలోని మేధావిగా తనకున్న ప్రతిష్టను, ఆదరణను నాగేశ్వర్ ఎక్కువగా అంచనా వేసుకున్నారనిపిస్తుంది.
అదే సమయంలో జెపిని గెలిపించడానికి చంద్రబాబు మల్కాజిగిరిలో బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దించారనే విమర్శలు వచ్చాయి. అయితే, చంద్రబాబు పక్కా వ్యూహంతో, బిజెపి సహకారంతో మల్లారెడ్డిని విజయపథంలో నడిపించారు. కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పోటీ చేయడానికి చంద్రబాబుపై సమరమే సాగించారు. చివరకు ఆయనను ఒప్పించి, చంద్రబాబు పక్కకు తప్పించారు.
కూకట్పల్లి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చేసిన సూచనను జెపి తిరస్కరించారు. కూకట్పల్లి అసెంబ్లీ స్థానాన్ని టిడిపి దక్కించుకుంది. ప్రస్తుతం ఆ స్థానానికి జెపి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జెపి అత్యాశకు వెళ్లారా అనే అనుమానం కలుగకమానదు. టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి తెలంగాణకు చెందినవారు కావడం కూడా కలిసి వచ్చినట్లుంది.