షాక్: మండల స్థాయికి దిగిన పీకే టీమ్, ‘సెకెండ్’పై దృష్టి, వైసీపీ నేతల్లో టెన్షన్
తమ పార్టీ ప్లీనరీ భారీ స్థాయిలో జరిగిందనే ఆనందంలో మునిగితేలుతున్న గుంటూరు వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ పార్టీ నేతలను ‘పీకే ఫీవర్’ పట్టుకుంది.
అమరావతి: తమ పార్టీ ప్లీనరీ భారీ స్థాయిలో జరిగిందనే ఆనందంలో మునిగితేలుతున్న గుంటూరు వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ పార్టీ నేతలను 'పీకే ఫీవర్' పట్టుకుంది.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్కుమార్ (పీకే)ను నియమించుకున్న విషయం తెలిసిందే.
మొన్నటి వరకు కేవలం సూచనలకే పరిమితమైన పీకే టీమ్ ప్రస్తుతం మండల స్థాయిలో పర్యటనలు మొదలు పెట్టడంతో గుంటూరు జిల్లా నియోజకర్గ నేతల్లో బెంగ మొదలైంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ టీమ్ మండలాల వారీగా పర్యటించి నివేదికలు తయారు చేస్తోంది.
మండల స్థాయికి దిగిన పీకే బృందం...
పీకే సైన్యం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మండలస్థాయిలో వైసీపీ ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చలు సాగిస్తున్నారు. ఆ చర్చలో ప్రధానంగా.. రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? వాటికి సంబంధించిన వ్యూహాలను ఏ విధంగా అనుసరించాలి? అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పదవి పొందిన నాయకులు ఆ పదవికి తగిన విధంగా పనిచేస్తున్నారా? లేదా? అదే ప్రాంతంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు? వారెలా పనిచేస్తున్నారు? అనే విషయాలను పీకే బృందం అత్యంత గోప్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం.
నేతల్లో సమన్వయంపై చెక్...
పీకే బృందం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై అంచనా వేసేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ విద్యార్థులతో సర్వే చేయించింది. తాజాగా పీకే బృందం అసలు పార్టీలో నేతల మధ్య సమన్వయం ఉందా? పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం.. తదితర విషయాలపై వైసీపీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునే పని మొదలు పెట్టారు.
Recommended Video
నియోజకవర్గ స్థాయి నేతల్లో బెంగ...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం మండల స్థాయిలో సర్వే చేపట్టడంతో ఇక ఇన్చార్జిల్లో మార్పులు, చేర్పులు ఖాయమనే బెంగ నియోజకర్గ నేతలను పట్టుకుంది. గుంటూరు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో గడిచిన మూడేళ్లుగా నియోజక వర్గ ఇన్చార్జిలే అంతా తామై నడిపిస్తున్నారు. రెండేళ్లపాటు స్తబ్దుగానే ఉన్నా మూడో ఏట అడుగుపెట్టే సమయానికి వీరికి కొంత దైర్యం వచ్చింది. ఇక నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్లీనరీలు విజయవంతం కావడం సరికొత్త దైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఉన్నట్లుండి పీకే బృందం మండల స్థాయిలో జల్లెడ పడుతుండడంతో పలువురు వైసీపీ నాయకులకు ‘పీకే ఫీవర్' పట్టుకుంది.
అందరిలోనూ పీకే ఫీవర్...
రాజకీయ సలహాదారుడు పీకే ప్రవేశంతో వైసీపీలో అంతా గందరగోళంగా మారినట్లు చెబుతున్నారు. ఫలానా నియోజకవర్గ ఇన్చార్జిను పీకేయడం ఖాయం.. అనే ప్రచారం కొన్నిచోట్ల అప్పుడే మొదలైంది. ఈ పరిస్థితుల్లో అసలు పార్టీలో తమ స్థానం చివరి వరకు పదిలమేనా? అనే సందేహం చాలామంది నేతల్లో ఏర్పడింది. వీరిలో 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తమకు ఢోకా లేదనే ధీమాతో మరికొందరు ఉన్నారు. కానీ ప్రశాంత్కిషోర్ లెక్కల ఆధారంగానే భవిష్యత్తులో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ బాధ్యతలు ఉంటాయన్న సమాచారం సహజంగానే నియోజకవర్గ ఇన్చార్జిల్లో దడ పుట్టిస్తోంది.
సిట్టింగ్ల్లో మొదలైన కంగారు...
ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొంతమంది ఇన్చార్జిలను మార్చాలని పీకే వైసీపీ అధిష్ఠానానికి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. ఏదిఏమైనా పీకే రంగప్రవేశంతో గుంటూరు జిల్లా వైసీపీ ముఖచిత్రమే మారిపోయింది.
వినుకొండ వైసీపీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ...
వినుకొండలో కూడా సోమవారం వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ టీమ్ పర్యటించింది. లాయర్స్ స్ట్రీట్ లోని వైసీపీ నూతన కార్యాలయం వద్ద ఐదు మండలాల వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు.
ప్రతివారం రాజకీయ శిక్షణ తరగతులు?
పదవి తీసుకున్న నాయకులు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించడం ఎలా? అనే అంశంపై పీకే బృందం ఐదు మండలాల వైసీపీ నాయకులకు వివరించారు. వినుకొండలోనే ప్రతివారం వైసీపీ నాయకులకు రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై పక్కా ప్రణాళికను రూపొందించి వాటికి అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా అవగాహనను కల్పించనున్నట్లు సమాచారం.
సలహాలు.. సూచనలు స్వీకరణ
పీకే బృందం వినుకొండ నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలానికి చెందిన నాయకులతో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆ నాయకులకు తమ ఉద్దేశాలను వివరించి, పార్టీ బలోపేతం కోసం వారిచ్చే సలహాలు, సూచనలు సేకరించినట్లు సమాచారం.
అయోధ్య రామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత?
నరసరావుపేట లోక్ సభ స్థానానికి సంబంధించి అభిప్రాయాలను కోరగా అయోధ్య రామిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మేకపాటి రాజమోహన్రెడ్డి లేదా వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.
కడపలోనూ పీకే బృందం...
పీకే బృందంలోని ఉత్తరాదికి చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ఒకరు సోమవారం కడపకు వచ్చారు. ఇక్కడి వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమరనాధరెడ్డి, నగర అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి, విద్యార్థి సంఘం, ఎస్సీ, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, యువజన విభాగం అధ్యక్షులతో వారు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు పీకే బృందం కడప జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎలా ఉంది? నేతలు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఏమైనా ఉందా? పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు? పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు? పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై ఆయా సంఘాల అధ్యక్షులతో చర్చించారు.
అధికారం కావాలంటే మారాల్సిందే...
పార్టీ అధికారంలోకి రావాలంటే నాయకుల్లో కూడా మార్పు రావాలని పీకే బృందం చెప్పినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజులు కడప జిల్లాలోనే మకాం వేసి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నేతలతో కూడా సమావేశం కానున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మొత్తంమీద పీకే టీమ్ మండల స్థాయికి దిగడంతో వైసీపీలోని పలువురు నాయకులకు భయం పట్టుకుందని చెప్పొచ్చు.