స్వామి ప్రబోధానందకు షాక్!...ఒక్కసారిగా 30 మంది శిష్యుల అరెస్ట్:పోలీసుల తిప్పలు
అనంతపురం:స్వామి ప్రబోధానందకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. తాడిపత్రి పరిధిలో చిన్నపొలమడ గ్రామంలో దాడులు,విధ్వంసానికి పాల్పడిన కేసుకు సంబంధించి 30 మంది ప్రబోధానంద శిష్యులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులే బుధవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈనెల 15 న గణేష్ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన ఘర్షణల నేపధ్యంలో ప్రబోధానంద శిష్యులు రెండు రోజుల పాటు భీకర దాడులకు పాల్పడటంతో ఒకరు మృతి చెందడంతో పాటు పోలీసులతో సహా పలువురు గాయపడడానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రబోధానంద శిష్యులపై దాదాపు 27 కేసులు నమోదు చేయగా...తాజాగా ఆ కేసులకు సంబంధించి 30 మంది శిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video
కొ** పదం తప్పా?...ఆ సిఐ నా చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో?:జెసి, ప్రబోధానందని బహిష్కరించాలి:మత పెద్దలు
మరోవైపు ప్రబోధానంద శిష్యుల అరెస్ట్ నేపథ్యంలో మిగతా శిష్యులు పోలీసులపై స్పీడ్ పోస్ట్ ల యుద్దం ప్రారంభించారు. దాడులకు సంబంధించి ప్రబోధానంద శిష్యులను మాత్రమే టార్గెట్ చేసి అరెస్టు చేయడం ఏమిటని, తమపై దాడులకు పాల్పడిన చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాలకు చెందినవారిని పోలీసులు దుకు పోలీసులు అరెస్టు చేయలేదని వీరు ప్రశ్నిస్తూ వివిధ ప్రాంతాల నుంచి పోలీసులకు స్పీడ్పోస్టులు పంపిస్తున్నారు.
ఊహించని విధంగా వారి నుంచి ఎడతెరిపి లేకుండా వచ్చిపడుతున్న ఈ స్పీడ్పోస్టులతో తాడిపత్రి రూరల్ పోలీసులు అల్లాడిపోతున్నారు. ఇలా ప్రబోధానంద శిష్యుల నుంచి బుధవారం ఒక్కరోజే దాదాపు 25 స్పీడ్పోస్టులు రాగా గడచిన రెండురోజులుగా ఇలా వచ్చిన స్పీడ్పోస్టులు వంద దాటాయి. వీటన్నింటినీ సారంశం ఒకటే కావడంతో...ప్రతి స్పీడ్ పోస్ట్ లో ఇదే మ్యాటర్ ఉంటుండటంతో మొదట్లో కొన్నింటిని తెరిచి చదివిన పోలీసులు ఆ తరువాత వచ్చిన స్పీడ్ పోస్టులను మాత్రం చూసి పక్కన పడేస్తున్నారని తెలిసింది. అయితే స్పీడ్ పోస్టులు మాత్రం వస్తూనే ఉండటం, వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు ప్రబోధానంద ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన అపరిశుభ్రత నెలకొని ఉండటంపై ఓఎస్డీ చౌడేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖంగుతిన్న అక్కడి సిబ్బంది వెంటనే పారిశుధ్య కార్మికులను పిలిపించి అక్కడ ఎటు చూసినా కనిపిస్తున్న ఎంగిలి విస్తరాకులతో సహా చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. అప్పటికప్పుడే అక్కడ డస్ట్బిన్లను ఏర్పాటుచేశారు.