టీడీపీ, ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్: వైసీపీలోకి కీలక అనుచరుడు, పులివెందుల కాంగ్రెస్ నేత కూడా
కడప: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలలోని పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. మరికొందరు చూస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్య నేతల కీలక అనుచరులు కూడా పార్టీలు మారుతున్నారు. తాజాగా, జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి భారీ షాక్ తగిలింది.
ఆదినారాయణ రెడ్డి కీలక అనుచరుడు
ఆయన ముఖ్య అనుచరుడు చెన్నకేశవ రెడ్డి శనివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. చెన్నకేశవ రెడ్డి.. ఆదినారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు. చిన్నవెంతుర్లు గ్రామానికి చెందిన నేత. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ఈ చేరికతో పార్టీ మరింత బలపడిందన్నారు.
జగన్ తీరుపై అసంతృప్తితో టీడీపీలోకి ఆది
ఆదినారాయణ రెడ్డి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ తీరు పైన అసంతృప్తితో, మరికొన్ని కారణాలతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆది మంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు చాలామంది నేతలు నడిచారు. ఇప్పుడు అందులోని చెన్నకేశవ రెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. జగన్ తీరుతో తాము వైసీపీని వీడినట్లు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు చెబుతూ, టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందులో ఆది ఒకరు.ఆయన వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన నష్టం లేదని, తమ కేడర్కు తోడు టీడీపీ బలం ఉందని చెబుతున్నారు.
వైసీపీలోకి మరికొందరు టీడీపీ నేతలు
ఇదే సమయంలో మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు. జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు గొర్ల ఉపేంద్ర రెడ్డి, ఎంపీటీసీలు, మరికొందరు నేతలు వాహనాల్లో ఇడుపులపాయకు వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఉపేంద్రరెడ్డి తదితరులకు జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ చెన్నూరు మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి కూడా వైసీపీలోకి జంప్ చేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నేతృత్వంలోను పలువురు చేరారు.
వైసీపీలో చేరిన పులివెందుల నేత
జమ్మలమడుగులో టీడీపీ నేత చెన్నకేశవ రెడ్డి, ఇతర టీడీపీ నేతలే కాకుండా, పులివెందుల కాంగ్రెస్ నేత కూడా వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ లాయర్ అబ్దుల్ గఫూర్ పులివెందులలో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు వందలాది మంది పార్టీలో చేరారు.