ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసన
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంటే, జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహిస్తుంటే మరో పక్క టీడీపీ లోని కీలక మంత్రులకు ప్రచారంలో నిరసన సెగ తగులుతుంది.
అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత , ఉపముఖ్యమంత్రి అయిన చినరాజప్పకు ప్రచారంలో గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీకి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి హుస్సేన్ పురంగ్రామానికి వెళ్ళిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో సమస్యలు పరిష్కరించని చినరాజప్ప ఏ ముఖం పెట్టుకుని గ్రామంలోకి వచ్చి ఓట్లు అడుగుతారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మకాయల చినరాజప్పను ప్రచారానికి రావద్దు అంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. రాజప్ప.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)
మంత్రి చినరాజప్ప హుస్సేన్ పురం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినా, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా ఆందోళన చేయడంతో చేసేదేమీ లేక చినరాజప్ప ప్రచారం నుంచి వెనుదిరిగారు. దీంతో టీడీపీకి కొన్ని చోట్ల ప్రతికూల పవనాలు వీస్తున్నాయని అర్ధం అవుతుంది. ముఖ్యంగా మంత్రులు బరిలోకి దిగిన నియోజకవర్గాలలోనే వ్యతిరేఖత ఉండటం గమనార్హం .