ఏపీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఆర్ధిక శాఖ ..జీతాలు ఆలస్యం అని ప్రకటన... రీజన్ ఇదేనా
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడలేదు అన్న చర్చ ఇప్పుడు ఏపీ ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఏపీ ఖజానాలో డబ్బులు లేవా ? ఇక ముందు ముందు మనకు జీతాలకు తిప్పలేనా ? అసలు ఏపీ లో ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడకపోవడం పై ఆర్థిక శాఖ ఏమంటుంది ? వంటి అనేక ప్రశ్నలు ఉద్యోగ వర్గాల్లో ఉత్పన్నం అయ్యాయి .
Recommended Video
ఏపీ ప్రభుత్వోద్యోగులకు వేతనాల చెల్లింపు జాప్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు పడకపోవడం ఒక చేదువార్త. ప్రతి నెలా 1వ తేదీన సాయంత్రానికల్లా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలను జీతాలు జమవుతాయి. కానీ ఈ సారి ఇప్పటివరకూ వేతనాలు పడకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఏపీ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఇదే తరహా ఇబ్బంది ముందు ముందు కూడా కొనసాగుతుందా అన్న ఆలోచనలో ఉద్యోగులున్నారు. అయితే జూలై నెల వేతనాలు చెల్లింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై నెలకు సంబంధించి 4 లక్షల మంది ఉద్యోగులకు గురువారం నాటికి బ్యాంకుల్లో జమ కావాల్సిన జీతం ఇంకా పడలేదని సమాచారం .
టెన్షన్ పడిన ఉద్యోగులు .. సాంకేతిక కారణాల వల్లే అన్న ఆర్ధిక శాఖ
ఇక వేతనాల విషయంలో ఉద్యోగులు ఆర్ధిక శాఖను సంప్రదించారు. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుభేర్ ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులు జరుగుతాయి. అయితే ఈ నెల కూడా ఏపీకి సంబంధించి అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైల్స్ యధాప్రకారం జూలై 31నే ఆర్బీఐకి పంపామని చెప్పిన అధికారులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల చెల్లింపులో జాప్యం అయిందని పేర్కొన్నారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించి.. వేతనాల చెల్లింపు చేస్తామని అధికారులు తెలిపారు.
సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే వేతనాల చెల్లింపు
శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం లోగా వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో పడతాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగానే జీతాల చెల్లింపులు ఆలస్యమైందని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కానీ జీతాలు చెల్లించలేకపోవటానికి నిధుల కొరత కారణం కాదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ సాంకేతిక కారణాలతో జరిగిన జాప్యం ఈరోజు పరిష్కారం అవుతుందని అందరికీ జీతాల చెల్లింపు జరుపుతామని ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు ఊపిరి పీల్చుకునే సమాచారం చెప్పింది.