సుజనా చౌదరి 315 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ .. చంద్రబాబుకు భారీ షాక్
Recommended Video
ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల నుండి గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపిన పార్టీల అధినేతలు ప్రచార పర్వాన్ని తమ మాటలతో పీక్స్ కి చేర్చారు. మాటల తూటాలు పేలుస్తూ ప్రచారాల జోరు పెంచిన తరుణంలో టీడీపీ కి ఊహించని షాక్ తగిలింది. ఒక పక్క ఇంకా పట్టుమని వారం రోజులు కూడా పోలింగ్ కు సమయం లేదు. ఈ తరుణంలో సుజనా చౌదరి ఆస్తులను అటాచ్ చేసి ఈడీ సుజానా చౌదరి కి, చంద్రబాబుకి షాక్ ఇచ్చింది.
టీడీపీ భారీ స్కెచ్.. చివరి ఐదు రోజులే టార్గెట్ !? వైసీపీ వ్యూహం ఏంటీ ?
ఎన్నికల సమయంలో టీడీపీ కి షాక్... సుజనా చౌదరికి చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సుజానా చౌదరికి ఈడీ ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఎన్నికలకు ముందు సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ సోదాలు చేసింది. ఆ సమయంలో సుజనా చౌదరి కంపెనీలపై దాడులు కేంద్రం కుట్ర అని చంద్రబాబు విరుచుకు పడ్డారు. అయితే సుజనా చౌదరి షెల్ కంపెనీల ద్వారా భారీగా నిధులు బదలాయింపు జరిగిందని ఈడీ గుర్తించింది.
సుజనా గ్రూప్ సంస్థల పేరుతో షెల్ కంపెనీలు... అందుకే ఆస్తుల అటాచ్
సుజనా గ్రూప్ సంస్థ బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్లు రుణం తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. బీసీఈపీఎల్ కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ షెల్ కంపెనీలను గుర్తించింది. అనంతరం ఆ కేసును ఈడీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ సుజనా గ్రూప్ సంస్థలు, సుజనా చౌదరి ఆస్తులపై సోదాలు నిర్వహించింది.పెద్ద మెుత్తంలో షెల్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ ,షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వైస్రాయ్ హోటల్, మహాల్ హోటల్ కి బదిలీ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వైస్రాయ్ హోటల్ కి సంబంధించి ఆస్తులను జప్తు చేసింది. చెన్నైలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ నుంచి షెల్ కంపెనీల పేరుతో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సొమ్మును బీసీఈపీఎల్ కంపెనీ సుజనా కంపెనీలకి బదిలీ చేసిందని సమాచారం. చెన్నై, బెంగళూరులోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
సుజనా ఆస్తుల అటాచ్ తో టీడీపీ నేతల వెన్నులో వణుకు .. చంద్రబాబుకు షాక్
ఇక సుజనా ఆస్తుల జప్తు తో మరికొంత మంది టీడీపీ కీలక నేతల వెన్నులో వణుకు పడుతుంది. ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేత అయిన సుజనా చౌదరి ఆస్తుల అటాచ్ చంద్రబాబుకు ఊహించని భారీ షాక్ అని తెలుస్తుంది . ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో ఇంకా కేంద్ర సంస్థలు ఎవరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయాందోళన నెలకొంది. అప్పట్లో సోదాలు నిర్వహించిన సీఎం రమేష్ కు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. మొత్తానికి పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన తరుణంలో ఈడీ సుజనా ఆస్తులను అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తుంది.